ఇదే మొదటి ఒప్పందం:
షెఫాలీ వర్మతో పెప్సీ ఒక సంవత్సరం పాటు ఒప్పందం కుదుర్చుకుందట. ప్రముఖ బ్రాండ్తో షఫాలికి ఇదే మొదటి ఒప్పందం. ఐకానిక్ బ్రాండ్ పెప్సీతో ఒప్పందం చేసుకోవడం చాలా థ్రిల్లింగ్గా ఉందని షెఫాలీ వర్మ పేర్కొంది. 'మంచి పేరున్న బ్రాండ్ 'పెప్సీ'తో అనుబంధం పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో అర్ధం కావట్లేదు. మహిళలు తమ జీవితానికి సంబంధించి అన్ని విభాగాల్లోనూ దూసుకుపోతున్నారు. ఇది మా కాళ్లపై మేం నిలబడాల్సిన తరుణం' అని షెఫాలీ అంది. ఇక ప్రపంచకప్ ఫైనల్లోనూ మెరుపులు మెరిపిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా షెఫాలీ పేరు మార్మోగిపోతోంది.
6 నెలల్లోనే ప్రపంచ నంబర్వన్:
గతేడాది సెప్టెంబర్ నెలలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 16 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం షెఫాలీ వర్మ ఆరు నెలల కాలంలోనే ప్రపంచ నంబర్వన్గా అవతరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. గత రెండేళ్లుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ను వెనక్కి నెట్టి టాప్ దక్కించుకుంది. ఈ ర్యాంకును కేవలం 18 మ్యాచులు మాత్రమే ఆడి దక్కించుకోవడం విశేషం.
మిథాలీ తర్వాత షెఫాలీనే:
భారత సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ తర్వాత ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానం సాధించిన భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మనే కావడం గమనార్హం. ప్రస్తుత మెగా టోర్నీలో నాలుగు లీగు మ్యాచుల్లో కలిపి 161 పరుగులు చేసింది. అత్యధికంగా శ్రీలంకపై 47 పరుగులు చేసింది. ప్రపంచకప్లో మూడు మ్యాచుల్లో 11 బౌండరీలు, 8 సిక్స్లతో మొత్తంగా 114 పరుగులు చేసి 172.7 స్టైక్రేట్ను నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక టీ20 మ్యాచ్లలో 146.96 స్ట్రైక్ రేట్తో 485 పరుగులు చేసింది.
సెహ్వాగ్ తరహాలో విధ్వంసం:
అంతర రాష్ట్ర పోటీల్లో నాగాలాండ్పై అద్భుత సెంచరీ చేసిన షెఫాలీ సెలక్టర్ల దృష్టిలో పడింది. ఆ తర్వాత ఐపీఎల్ 'మహిళల టీ20 ఛాలెంజ్'లో ఆడించారు. తన ఆటతో అదరగొట్టిన ఆమెకు గతేడాది సెప్టెంబర్లో దక్షిణాఫ్రికా సిరీసులో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆమె డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో విధ్వంసకర షాట్లతో ప్రత్యర్థులను వణికిస్తూ భారత జట్టు ఎక్స్-ఫ్యాక్టర్గా మారింది.