సమగ్ర నివేదికను సీవోఏకు సమర్పించే అవకాశం
"విడివిడిగా సమావేశమైన వారు వారి అభిప్రాయాలను వివరించారు. వారి వైపు నుంచి ఏం చెప్పాలో అది చెప్పారు. మేం ప్రతీ అంశాన్ని రాసుకున్నాం. అయితే మేము ఏం చర్చించామని మాత్రం నన్నడగవద్దు" అని అన్నాడు. ఇదిలా ఉంటే సమావేశంపై జోహ్రీ, కరీం వేర్వేరుగా తమ నివేదికలను సీవోఏకు సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోచ్ రమేశ్ పొవార్ కూడా జోహ్రి, కరీంలను బుధవారం కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత అన్ని అంశాలతో కలిపి సీఓఏకు జోహ్రి సమగ్ర నివేదిక అందజేస్తారు.
మిథాలీని తప్పిస్తూ నిర్ణయం తీసుకోవడంపై
వరల్డ్ టీ20లో మంచి ఫామ్ మీదున్న మిథాలీని తప్పిస్తూ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మందాన, చీఫ్ కోచ్ రమేవ్ పవార్, సెలెక్షన్ కమిటీ సభ్యురాలు సుధాషా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అటు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం తీవ్ర విమర్శలు గుప్పించారు. మిథాలీ తొలగింపు వివాదానికి కారణమైన భారత మహిళల క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రమేశ్ పవార్పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. సీనియర్ క్రికెటర్లతో పొసగని తుషార్ అరోతె స్థానంలో ఆగస్టులో కోచ్ బాధ్యతలు అందుకున్న పవార్ జట్టులో అనేక మార్పులు తీసుకొచ్చాడు.
కోచ్ పవార్పై వేటు పడనుందా?
తనకున్న సుదీర్ఘ అనుభవంతో మహిళా క్రికెటర్ల ఆటతీరులో మార్పుతీసుకొచ్చాడు. అప్పటి వరకు తుషార్ శిక్షణ పద్ధతులతో విసిగి వేసారిన సీనియర్లకు పవార్ రాక మంచి ఉత్సాహాన్ని నింపింది. గెలుపొటములతో సంబంధం లేకుండా ఆత్మవిశ్వాసంతో ఆడాడంటూ పవార్ తనదైన శైలిలో మార్పుతీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే, వరల్డ్ టీ20 టోర్నీలో ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ పవార్ కోచ్ పదవికి ఎసరు తెచ్చింది. అప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ల్లో రెండు హాఫ్ సెంచరీలతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన మిథాలీరాజ్ను తప్పించడంతో కోచ్ పవార్ నిర్ణయమే కీలకం కావడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
నవంబర్ 30తో ముగియనున్న కోచ్ పదవి
ఆగస్టులో కోచ్గా బాధ్యతలు తీసుకున్న రమేశ్ పవార్ పదవి నవంబర్ 30తో ముగియనుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పవార్ కాంట్రాక్టును పొడిగించేందుకు బీసీసీఐ అంత సుముఖంగా లేన్నట్లు తెలుస్తున్నది. కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ త్వరలోనే దరఖాస్తులు ఆహ్వానించనుంది. మరోవైపు మిథాలీరాజ్ టీ20లకు వీడ్కోలు పలికే ఆలోచనలో ఉంది. వరల్డ్ టీ20లో మిథాలీని టీమ్ మేనేజ్మెంట్ కావాలనే పక్కకు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్తో తొలి మ్యాచ్లో మిథాలీని బ్యాటింగ్ ఆర్డర్లో వెనుకకు పంపడంతో బ్యాటింగ్ ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించి వరుసగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను అందుకుంది.
ఉద్దేశపూర్వకంగానే మిథాలీని తప్పించారనే వార్తలు
అయితే ఆస్ట్రేలియాతో ఆఖరి లీగ్ మ్యాచ్లో గాయాన్ని కారణంగా చూపుతూ మిథాలీని తుది జట్టుకు ఎంపిక చేయలేదు. ఆస్ట్రేలియాపై అనూహ్య విజయం సాధించిన జట్టునే ఇంగ్లాండ్తో సెమీస్ మ్యాచ్లోనూ కొనసాగించడం భారత విజయావకాశాలను ఘోరంగా దెబ్బతీసింది. ఈ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో టీమిండియా వరల్డ్కప్ ఆశలు ఆవిరయ్యాయి. ఉద్దేశపూర్వకంగానే మిథాలీని తప్పించారనే వార్తలు రావడంతో వివాదం మరింత ముదిరింది. భారత్ తరఫున 85 టీ20 మ్యాచ్లాడిన 35 ఏళ్ల మిథాలీ 17 హాఫ్ సెంచరీలతో 2283 పరుగులు చేసింది. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డుని సైతం తన ఖాతాలో వేసుకుంది.