
హైదరాబాద్: పుల్వామా ఉగ్ర దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు జాతి మొత్తం మేమున్నామంటూ మద్దతుగా నిలుస్తోంది. ఈ ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్ల పిల్లలకు విద్యనందించేందుకు భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందు కొచ్చాడు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
"అమర జవాన్లకు మనం ఏం చేసినా తక్కువే. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలకు అండగా నిలుద్దాం. ఉగ్రదాడిలో మరిణించిన సీఆర్పీఎఫ్ వీర జవాన్ల పిల్లల చదువు బాధ్యతను నేను తీసుకుంటున్నాను. వారంతా నా ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకోవచ్చు" అని ట్విట్టర్లో సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
మరోవైపు హర్యనా పోలీస్ శాఖలో ఉన్నత ఉద్యోగి అయిన స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన ఒక నెల జీతాన్ని అమరుల కుటుంబాలకు అందజేస్తున్నట్లు ప్రకటించాడు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందగా... తీవ్రంగా గాయాలపాలైన పలువురు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
ఈ ఉగ్రదాడికి నిరసనగా ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో ఉన్న మాజీ క్రికెటర్, ప్రస్తుత పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చిత్ర పటాన్ని పరదాతో కప్పి నిరసన ప్రకటిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.