
హైదరాబాద్: ఏడు నెలల క్రితం మహిళా క్రికెట్లో ప్రపంచకప్ గెలుచుకున్న మిథాలీ సేన అదే దూకుడుతో రాణిస్తుంది. వరల్డ్ కప్ అనంతరం ఆడిన మొదటి మ్యాచ్, అందులోనూ విదేశాల్లో జరుగుతున్న మ్యాచ్ కావడంతో టీమిండియా క్రికెటర్లు మ్యాచ్ కు వెళ్లే ముందు కాస్త తడబడ్డారు. కానీ, అనుకోని విధంగా పరుగులు చేసి ఘన విజయాన్ని సాధించారు.
ఈ విజయానికి నెటిజన్లతో పాటు సీనియర్ క్రికెటర్లు మిథాలీ సేనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తన సరదా ట్వీట్లతో నెటిజన్లను ఆకట్టుకునే సెహ్వాగ్ సైతం టీమిండియా క్రీడాకారిణులను ట్విటర్లో అభినందించారు.
ఓవైపు వన్డేల్లో కోహ్లీసేన ఆతిథ్య దక్షిణాఫ్రికా ఆటగాళ్లను బెంబేలెత్తిస్తుండగా.. ఇదే గడ్డపై భారత అమ్మాయిలూ సిరీస్లో తొలి మ్యాచ్లో గెలిచి సఫారీ మహిళల జట్టుపై ఆధిక్యం సంపాదించడం విశేషం. ఈ సందర్భంగా సెహ్వాగ్ ట్వీట్ చేస్తూ.. 'వెల్డన్ భారత అమ్మాయిలు. అద్భుతమైన ఆటతీరుతో దక్షిణాఫ్రికాపై సమష్టిగా మున్ముందు మ్యాచ్లలోనూ విజయం సాధించాలి అని సూచించారు. వీరూ ట్వీట్ను నెటిజన్లు భారీ సంఖ్యలో రీట్వీట్ చేస్తూ తమ మద్దతును తెలియజేస్తున్నారు.
దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా కింబర్లీలో జరిగిన తొలి మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత మహిళల జట్టు 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ మందన(88) బ్యాట్తో రాణించగా.. జులన్ గోస్వామి(4/24), శిఖా పాండే(3/23) బంతితో విజృంభించడంతో భారత్ సులువుగా గెలుపొందింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.