ఇమ్రాన్ ఏమన్నారంటే..
టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ ఎంచుకోవాలని ఇమ్రాన్ ఖాన్ తమ దేశ క్రికెట్ జట్టు కేప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్కు సూచించారు. తొలుత బ్యాటింగ్ చేయడం వల్ల భారీ స్కోరును చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన అంచనా వేశారు. మాంఛెస్టర్లో నెలకొన్న వాతావరణాన్ని బట్టి చూస్తే.. ఛేజింగ్ జట్టుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు. కాలం గడిచే కొద్దీ పిచ్పై తేమ శాతం పెరుగుతుందని, దీన్ని ఆధారంగా చేసుకుని మహమ్మద్ అమీర్ వంటి బౌలర్లు చెలరేగిపోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పుకొచ్చారు ఇమ్రాన్ ఖాన్.
దీనికి భిన్నంగా..
దేశ ప్రధాని ఒకటి తలిస్తే, జట్టు కేప్టెన్ సర్ఫరాజ్ మరోలా తలచాడు. ఇమ్రాన్ ఖాన్ సూచనలకు భిన్నంగా ప్రవర్తించాడు. టాస్ గెలిచినా మొదట బ్యాటింగ్ తీసుకోలేదు. టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దెబ్బయిపోయాడు. టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించి సర్ఫరాజ్ ఎంత పొరపాటు చేశాడో అర్థం కావడానికి ఇట్టే సమయం పట్టలేదు. తొలి ఓవర్ను మెయిడెన్గా ముగించిన భారత జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. ఆ తరువాత రెచ్చిపోయి ఆడారు. జట్టు స్కోరు 300 ప్లస్ సాధించడానికి చక్కని బాటలు వేశారు.
ప్రధాని చెప్పినట్టు విని ఉంటే..
అదే సమయంలో- తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని, టీమిండియాను బౌలింగ్ వనరుల ద్వారా టీమిండియాను కట్టడి చేయొచ్చని భావించిన సర్ఫరాజ్ ఆశలు నీరుగారిపోయాయి. బౌలర్లు కనీస ప్రభావం చూపలేక చేతులెత్తేస్తే.. సర్ఫరాజ్ ఆవలిస్తూ ఉండిపోయాడు. పాకిస్తాన్లో ప్రభుత్వం అనేది అక్కడి ప్రజల చేతుల్లో ఉండదని, ఉగ్రవాదులు, మిలటరీ అధికారులు దేశాన్ని పరోక్షంగా శాసిస్తారని చెబుతుంటారు. ఈ విషయం తాజాగా మరోసారి నిరూపితమైనట్టుంది. సాక్షాత్తూ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన సూచనలను చివరికి క్రికెటర్లు కూడా పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విలువైన సూచనలు పట్టించుకోకుండా..
ప్రపంచకప్లో ఇప్పటిదాకా పాకిస్తాన్ జట్టు టీమిండియాపై ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ రెండు జట్లు మొత్తం ఆరుసార్లు తలపడగా.. అన్ని మ్యాచుల్లోనూ భారత జట్టే విజయ కేతనాన్ని ఎగురవేసింది. ఈ చెత్త రికార్డును మరిచి పోవాలని, సానుకూల దృక్పథంతో మ్యాచ్ ఆడాలని ఇమ్రాన్ ఖాన్ సూచించారు. తాను కేరీర్ను ఆరంభించే సమయానికి 70 శాతం విజయావకాశాలను 30 శాతం ప్రతిభను కొలమానంగా తీసుకునే వారని, తాను రిటైర్మెంట్ ప్రకటించే సమయానికి ఈ శాతం 50-50కి చేరిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో 60 శాతం మానసిక దృఢత్వం, 40 శాతం ప్రతిభ ఉండాలని అన్నారు.
ఒత్తిడిని జయించాలని చెప్పినా..
ఈ విషయంలో తన స్నేహితుడు సునీల్ గవాస్కర్ ప్రకటనను తాను ఏకీభవిస్తున్నానని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. భారత్, పాక్ జట్ల ఆటగాళ్లపై మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని ఇమ్రాన్ చెప్పారు. అచంచలమైన ధృడసంకల్పమే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తుందని అన్నారు. సర్ఫరాజ్ అహ్మద్ వంటి ఆటగాడు జట్టు కేప్టెన్గా ఉండటం తమ అదృష్టమని, ఆ అదృష్టాన్ని ఆయన విజయంగా మార్చుకోవాలని సూచించారు. ప్రతికూల దృక్పథంతో మ్యాచ్ను ఆడితే తప్పులు, పొరపాట్లు దొర్లుతాయని ఇమ్రాన్ అన్నారు. మానసిక దృఢతాన్ని ఏర్పరచుకోవాలని, ఒత్తిడిని తరిమి కొట్టాలని చెప్పారు. అలాంటప్పుడే విజయం సిద్ధిస్తుందని హితవు పలికారు.