బర్మింగ్హమ్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా తొలి టెస్టు మూడో రోజు ఆట కూడా పూర్తి చేసేసుకుంది. అయినా తొలి ఇన్నింగ్స్ కెప్టెన్ కోహ్లీ ఆడిన ఆటతీరును చూసి ప్రముఖుల ప్రశంసలు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా వికెట్లు పడిపోతున్నా.. టెయిలెండర్లతో కలిసి జట్టుకు పరుగులు అందించడంపై కోహ్లీని కొనియాడుతున్నారు.
ఎడ్జ్బాస్టన్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులు చేసిన విరాట్ కోహ్లి ఇంగ్లిష్ ప్రజల హృదయాలు గెలిచాడు. విరాట్ వీరోచిత పోరాటం చేశాడని ఇంగ్లాండ్ మీడియా సైతం భారత కెప్టెన్పై ప్రశంసలు గుప్పించింది. విరాట్ పోరాటానికి దిగ్గజ క్రికెటర్లు సైతం ముగ్ధులయ్యారు. శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర కోహ్లిని ఆకాశానికి ఎత్తాడు. కోహ్లి ఆడుతున్న తీరు చూస్తుంటే.. అతడు అత్యుత్తమ భారత బ్యాట్స్మెన్ అవుతాడనిపిస్తోందని సంగక్కర ప్రశంసించాడు.
సచిన్ ఆడిన తీరు, ఒత్తిడిని ఎదుర్కొన్న విధానం వేరు, అతడు ప్రత్యేకమన్న సంగక్కర.. మాస్టర్ బ్లాస్టర్తో కోహ్లి సరితూగుతాడని తెలిపాడు. 'ప్రస్తుత తరంలోని ఉత్తమ ఆటగాళ్లలో కోహ్లి ఒకడు. అతడు మరింత పరిణతి చెందుతాడు. కోహ్లి కొంచెం ఇంఫ్రూవ్ అయితే.. మరిన్ని రికార్డులు బద్దలు కొడతాడు' అని సంగక్కర ధీమాగా చెప్పాడు. సచిన్ వంద సెంచరీల రికార్డును కూడా విరాట్ బ్రేక్ చేసే అవకాశం ఉందని, అయితే అతడెంత కాలం క్రికెట్లో కొనసాగుతాడనే దానిపై ఎన్ని రికార్డులు బ్రేక్ అవుతాయి అనేది ఆధారపడి ఉందని సంగక్కర తెలిపాడు.
తొలి టెస్టులో టీమిండియాను విజయం ఊరిస్తోంది. కానీ సాధించాలంటే కష్టపడాల్సిందే. మరోసారి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లి (43 బ్యాటింగ్; 76 బంతుల్లో 3 ఫోర్లు) భారత్ ఆశలను మోస్తున్నాడు. 194 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ శుక్రవారం, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. కోహ్లికి దినేశ్ కార్తీక్ (18 బ్యాటింగ్) అండగా ఉన్నాడు.