హైదరాబాద్: తన ప్రవర్తన తీరు సరిలేని కారణంగానే భారత జట్టులో గౌతమ్ గంభీర్ చోటు కోల్పోయాడని సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ సందీప్ పాటిల్ అన్నాడు. తాజాగా ముంబైలో ఓ స్థానిక ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో సందీప్ పాటిల్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
'గంభీర్ను అప్పట్లో జట్టు నుంచి తప్పించాం. అందుకు ప్రధాన కారణం అతడి తీరు సరిగా లేకపోవడమే. ఆ సమస్య రోజురోజుకీ పెరుగుతూ పోయింది. అతడికి ఆవేశం చాలా ఎక్కువ' అని సందీప్ పాటిల్ తెలిపాడు. 2011లో ఇంగ్లాండ్ సిరీస్లో బౌన్సర్ తగలడం, ఆ తర్వాత స్వదేశానికి తిరిగి రావడం గంభీర్కు చాలా నష్టం కలిగించిందని అన్నాడు.
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టు, మూడు రోజు క్యాచ్ అందుకునే ప్రయత్నంలో గంభీర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆ పర్యటన నుంచి గంభీర్ అర్ధాంతరంగా భారత్కు తిరిగొచ్చాడు. గంభీర్ రిపోర్టులను పరిశీలించిన తర్వాత గాయం తీవ్రత చాలా తక్కువగా ఉందని సందీప్ పాటిల్ అన్నాడు.
'గంభీర్ రిపోర్టులను చూసి ఒక్కసారిగా షాకయ్యా. ఎందుకంటే అందులో గంభీర్కు గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు లేదు. నిజానికి అతడు ఆ సిరిస్లో కొనసాగాల్సింది. అతడు ఇంగ్లాండ్ నుంచి అర్ధాంతరంగా భారత్కు తిరిగి రావడం ఆశ్చర్యం అనిపించింది. గాయం తీవ్రత అనేది ఆటగాడికి తెలుస్తుంది. దీనివల్లే అతడు భారత క్రికెట్లో లెజెండ్ అయ్యే గొప్ప అవకాశాన్ని కోల్పోయాడు' అని చెప్పాడు.
గంభీర్, తాను 7-8 ఏళ్ల పాటు స్నేహితులమని, జట్టు నుంచి తప్పించిన తర్వాత అతడు తనతో స్నేహాన్ని సైతం వదులుకున్నాడని సందీప్ పాటిల్ పేర్కొన్నాడు. కాగా, గంభీర్ను జట్టు నుంచి తప్పించినప్పుడు పాటిల్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్లో ఢిల్లీ డేర్డెవిల్స్ కెప్టెన్సీ కూడా గంభీర్ తప్పుకున్న సంగతి తెలిసిందే.