అసలేం జరిగింది?: సనత్ జయసూర్యపై రెండేళ్ల పాటు నిషేధం


హైదరాబాద్: శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్యపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. క్రికెట్ బోర్డులో ఎలాంటి పదవులు చేపట్టకూడదు. జయసూర్యను గరిష్టంగా ఐదేళ్లు నిషేధించేందుకు ఆస్కారమున్నా.. అతడి గత ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని శిక్షను రెండేళ్లకు పరిమితం చేసినట్లు ఏసీయూ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ వెల్లడించారు.

అసలేం జరిగింది?
గత కొన్నాళ్లుగా శ్రీలంక క్రికెట్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే. మొత్తంగా అక్కడి క్రికెట్ వ్యవస్థే అవినీతి కూపంలో చిక్కుకుపోయినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. జయసూర్యకు సైతం ఇందులో భాగమున్నట్లుగా స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. 2017లో జయసూర్య సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా ఉన్న సమయంలో శ్రీలంక.. సొంతగడ్డపై జింబాబ్వే లాంటి చిన్న జట్టు చేతిలో వన్డే సిరీస్ ఓడిపోవడం అప్పట్లో పెను సంచలనమైంది.

సొంతగడ్డపై జింబాబ్వే చేతిలో లంక ఓటమి
హంబన్టోటలో జరిగిన నాలుగో వన్డేలో లంక ఓటమి అనేక సందేహాలు రేకెత్తించింది. జట్టు ఎంపికలో అవకతవకలే ఆ సిరీస్ ఓటమికి కారణమన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఓటముల అనంతరం జయసూర్య తన పదవికి రాజీనామా చేశాడు. అయితే ఈ సిరీస్తో పాటుగా లంక క్రికెట్లో అనేక పరిణామాలపై సందేహాలతో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) 2017లోనే విచారణకు ఆదేశించింది.

జయసూర్యను పలుమార్లు విచారించిన ఏసీయూ
ఏసీయూ జనరల్ మేనేజర్ అలెక్స్ ఆధ్వర్యంలోని బృందం జయసూర్యను పలుమార్లు విచారించింది. 2017లో సెప్టెంబర్ 22, 23, ఆక్టోబర్ 5 తేదీల్లో జయసూర్యను విచారించిన తర్వాత ఈ కేసులో ప్రధాన సాక్ష్యం ఫోన్ సంభాషణే అని ఏసీయూ ప్రాథమికంగా ధ్రువీకరించింది. తన మొబైళ్లతో పాటు ఇతర సాంకేతిక పరికరాలు అందజేయాలని ఏసీయూ కోరగా.. అతనందుకు నిరాకరించాడు.

ప్రకారం సాక్ష్యాల్ని ధ్వంసం చేసినట్లు రుజువు కావడంతో
అంతేకాదు ఆ ఫోన్లను పగులగొట్టాడు. దీంతో ఐసీసీ ప్రవర్తన నియమావళిలోని 2.4.6 ఆర్టికల్ ప్రకారం విచారణకు సహకరించకపోవడం, 2.4.7 ప్రకారం సాక్ష్యాల్ని ధ్వంసం చేసినట్లు రుజువు కావడంతో అతనిపై ఐసీసీ రెండు రకాల అభియోగాలు మోపింది. అతను విచారణకు సహకరించకపోవడం ఒక అభియోగం. ఇక, రెండో అభియోగం విచారణను ఆలస్యమయ్యేలా చేయడం, అవసరమైన సమాచారాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించడం.

ఏసీయూ అభియోగాలను ఖండించిన జయసూర్య
తనపై ఏసీయూ ఈ అభియోగాలు మోపిన ఆ మరుసటి రోజే జయసూర్య వీటిని ఖండిస్తూ ప్రకటన జారీ చేశాడు. తాను పారదర్శకంగా వ్యవహరిస్తున్నానన్నాడు. తాను ఏ రకమైన అవినీతికి పాల్పడలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. తాజాగా తనపై మోపిన అభియోగాల్ని అనుసరించి ఐసీసీ శిక్షను ఖరారు చేసింది. రెండేళ్ల నిషేధం గత ఏడాది అక్టోబర్ 16 నుంచి అమలవుతుందని ఐసీసీ ప్రకటించింది.

నిషేధంపై జయసూర్య స్పందన
గత ఆరు నెలల్లో ఐసీసీ ఏసీయూ అభియోగాలు మోపిన మూడో క్రికెటర్ జయసూర్య. మాజీ ఆటగాళ్లు నువాన్ జోయ్సా, దిల్హర లోకుహెట్టిగె అవినీతి కార్యకలాపాల్లో భాగస్వాములైనట్లు ఏసీఏ పేర్కొంది. నిషేధం అనంతరం జయసూర్య మాట్లాడుతూ "నేనేమీ అవినీతికి పాల్పడ్డట్లు, బెట్టింగ్ చేసినట్లు అభియోగాలు ఎదుర్కోలేదు. నాపై వచ్చిన అభియోగాల్ని క్రికెట్ మీద ప్రేమతోనే అంగీకరించా. క్రికెట్ మంచి కోసం, దాని సమగ్రతను కాపాడేందుకే ఆ పని చేశా" అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications