బ్యాటింగ్లో లుక లుకలు..
ఈ క్రమంలోనే భారత్ విజయంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన సల్మాన్ బట్.. టీమిండియా బ్యాటింగ్ లైనప్లో కొన్ని లోపాలున్నాయని సూచించాడు. వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాలని చెప్పాడు. త్వరలోనే సూర్యకుమార్ స్థిరత్వం అలవర్చుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్ కెప్టెన్సీ బాగుందని, అయితే టీమిండియా మిడిలార్డర్ విఫలం కావడం కలవరపెట్టే అంశమని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్లోనూ దీనివల్లే భారత్ సెమీస్కు చేరలేకపోయిందని గుర్తు చేశాడు.
వారితో సూర్యను పోల్చవద్దు..
కివీస్తో మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ, రిషభ్ పంత్ కీలక పరుగులు చేయడం మినహా.. మిగతా రెండు మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోలేదని సల్మాన్ బట్ పేర్కొన్నాడు. అదే సమయంలో పంత్, ఇషాన్ కిషన్లతో సూర్యకుమార్ను పోల్చకూడదని పేర్కొన్నాడు. 'సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు 30+ వయసులో ఉన్నాడు. ఎంతో పరిణితి చెందిన ఆటగాడు. చాలా దేశవాళీ క్రికెట్ ఆడాడు. అతడిని ఇషాన్, రిషభ్ పంత్తో పోల్చడం సరికాదు. వారిద్దరు ఇంకా యువకులే. తక్కువ అనుభవం కలిగిన వారు'అని చెప్పుకొచ్చాడు.
ఒక్క హాఫ్ సెంచరీనే..
ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ ఇంకా స్థిరంగా ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. అయితే దీనికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందని ఈ పాక్ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ ముందు వరకు సూర్యకుమార్ యాదవ్కు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ప్రపంచకప్లో జట్టులో స్థానం దక్కినా.. సద్వినియోగం చేసుకోలేకపోయాడు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్ తొలి మ్యాచ్లో అర్ధశతకం (62) బాదిన సూర్యకుమార్.. మిగతా రెండు మ్యాచుల్లో దారుణంగా విఫలమయ్యాడు. రెండో టీ20లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సూర్య కేవలం ఒకే పరుగు చేయగా.. ఆఖరి టీ20లో ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చి డకౌటయ్యాడు.