హైదరాబాద్: భుజం గాయంతో బాధపడుతోన్న టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్మన్ వృద్ధిమాన్ సాహాకు ఇంగ్లాండ్లో శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బీసీసీఐ శనివారం అధికారిక ప్రకటన చేసింది. జులై నెలాఖరులో గానీ లేదా ఆగస్టు మొదటివారంలో గానీ మాంచెస్టర్లో అతనికి చికిత్స అందించనున్నట్లు బీసీసీసీ వెబ్సైట్లో పేర్కొంది.
సాహాతో పాటు అతడి భార్యను కూడా ఇంగ్లాండ్కు పంపించనున్నట్లు తెలిపింది. ఆమె వీసా దరఖాస్తును బోర్డు పంపించిందని, ఆ ప్రక్రియ జరుగుతోందని వీలైనంత తొందరగా సాహాను ఇంగ్లాండ్కు పంపించేందుకు బోర్డు ప్రయత్నిస్తోందని అందులో పేర్కొంది. సాహాకు మాంచెస్టర్కు చెందిన డాక్టర్ లెనార్డ్ ఫంక్ ఈ శస్త్రచికిత్స చేయనున్నాడు.
"గాయం నుంచి కోలుకోవడానికి సర్జరీ తప్పనిసరి అతనికి చెప్పాం. చికిత్స కోసం ముంబై, మాంచెస్టర్లలో ఒకదాన్ని ఎంచుకోవాలని కోరగా అతడు మాంచెస్టర్ను ఎంపిక చేశాడు. మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చి ఆడేందుకు అతనికి కనీసం 6 నుంచి 8నెలల సమయం పట్టవచ్చు" అని బీసీసీఐ తెలిపింది.
ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనలో సాహా క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అతని భుజానికి దెబ్బ తగిలింది. ఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడంతో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి స్వదేశానికి తిరిగొచ్చాడు. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్లో ఆడుతున్న సందర్భంగా చేతి వేలికి గాయం కారణంగా లీగ్ దశ నుంచే నిష్క్రమించాడు.
గాయం కారణంగా ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేసిన టెస్టు జట్టులో కూడా సాహాకు చోటు దక్కలేదు. తాజాగా శస్త్రచికిత్స కారణంగా ఈ ఏడాది నవంబర్లో ఆస్ట్రేలియా టూర్లో ఆడే అవకాశం లేదని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు పీటీఐకి తెలిపాడు.
భుజం నొప్పి తీవ్రంగా వేధిస్తున్నందున లండన్లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత కొంతకాలం పాటు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నాడు. అప్పటికి పూర్తిగా కోలుకుంటేనే తదుపరి మ్యాచ్లలో సాహా బ్యాట్ పట్టుకునే అవకాశం ఉంది. సాహా పూర్తిగా కోలుకోవడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని తెలిపాడు.