టెస్టు సిరీస్కు బరిలో ఉండే బౌలర్లు:
ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్ వంటి బౌలర్లున్నా భారత జట్టు గత కొంతకాలంగా భువనేశ్వర్ మీదే పేస్ బౌలింగ్ భారం వేసింది. ఇటీవలి టెస్టుల్లో భువనేశ్వర్ అంచనాలకు మించి రాణించాడు. వన్డే,టీ20ల్లో తిరుగులేని బుమ్రా ఇప్పటివరకూ టెస్టుల్లో మాత్రం పూర్తి స్థాయిలో విజృంభించలేదు. భువీ, బుమ్రా ఇద్దరూ దూరమవ్వడంతో తొలి టెస్ట్లో మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఇషాంత్ శర్మకు ఇంగ్లండ్పై మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.
ఆ ఇద్దరు లేకుండా ఇంగ్లండ్ ఆధిపత్యానికి చెక్ :
శార్డూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ సైతం రేస్లో ఉన్నారు. ఫాస్ట్, బౌన్సీ ఇంగ్లండ్ పిచ్లపై భారత స్పిన్నర్లు మ్యాజిక్ చేసే అవకాశాలు తక్కువే. భువీ, బుమ్రా కాంబినేషన్పై ఎన్నో అంచనాలు పెట్టుకున్న భారత్..ఈ ఇద్దరు లేకుండా ఇంగ్లండ్ ఆధిపత్యానికి చెక్ పెడుతుందో లేదో చూడాలి. ప్రధాన పేస్ బౌలర్ భువనేశ్వర్ లేకపోవడం భారత జట్టుకు పెద్ద మైనస్ పాయింట్.
మైదానానికి వేడి గాలుల తాకిడి అధికంగా:
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు వాతావరణం ప్రతికూలిస్తుంది. ఈ మేరకు మ్యాచ్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ముందు ఎసెక్స్ జట్టుతో టీమిండియా ఆడాల్సిన నాలుగు రోజుల మ్యాచ్ను మూడు రోజులకు తగ్గించారు. ఈ మ్యాచ్ కోసం కేటాయించిన మైదానానికి వేడి గాలుల తాకిడి అధికంగా ఉండటమే ఇందుకు కారణం.
నాలుగు రోజుల మ్యాచ్ మూడు రోజులకే:
ఈ మ్యాచ్ ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం బుధవారం మొదలు కావాల్సి ఉండగా.. గురువారం ఆటను ఆరంభించాలని నిర్ణయించారు. భారత ఆటగాళ్లు మంగళవారం ఇదే మైదానంలో నెట్ ప్రాక్టీస్ చేశారు. ఆ సందర్భంగా వేడి గాలులు ఆటగాళ్లను ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే కోచ్ రవిశాస్త్రి.. ఎసెక్స్ కౌంటీ సిబ్బందితో మాట్లాడాడు. తర్వాతే మ్యాచ్ను కుదించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.