91 పరుగుల తేడాతో లంకపై ఆప్ఘనిస్థాన్ విజయం
ప్రస్తుతం ఆసియా కప్లో ఆడుతోన్న ఆప్ఘన్ జట్టుని రషీద్ సూపర్ ఫోర్కు అర్హత సాధించేలా చేశాడు. గ్రూప్-బీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఆప్ఘనిస్థాన్ 91 పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్ ఫోర్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా ఆప్ఘనిస్థాన్ గురువారం బంగ్లాదేశ్తో తలపడనుంది.
బంగ్లాదేశ్తో తలపడనున్న ఆప్ఘనిస్థాన్
ఈ మ్యాచ్లో విజయం సాధించి తన పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవాలని రషీద్ ఖాన్ భావిస్తున్నాడు. అంతేకాదు ఈ మ్యాచ్లో గనుక ఆప్ఘనిస్థాన్ విజయం సాధిస్తే గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచి సగర్వంగా సూపర్ ఫోర్కు వెళ్తుంది. అంతర్జాతీయ క్రికెట్లో రషీద్ ఖాన్ ఖాతాలో అనేక రికార్డులను సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్గా రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు.
అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన ఆటగాడు
కేవలం 44 మ్యాచ్ల్లో రషీద్ ఖాన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. 2015లో జింబాబ్వే జట్టుపై వన్డేల్లో అరంగేట్రం చేసిన రషీద్ ఖాన్... అదే ఏడాది అదే జట్టుపై టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 48 మ్యాచ్లాడిన రషీద్ ఖాన్ 110 వికెట్లు పడగొట్టాడు. ఇక, టీ20ల్లో రషీద్ ఖాన్ అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్స్ 5/3గా ఉంది. మొత్తం 35 మ్యాచ్లాడిన రషీద్ ఖాన్ 12.40 యావరేజితో 64 వికెట్లు పడగొట్టాడు.
భారత్తో జరిగిన ఏకైక టెస్టులో ఆడిన రషీద్ ఖాన్
భారత్తో జరిగిన ఏకైక టెస్టులో కూడా రషీద్ ఖాన్ ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రషీద్ ఖాన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మహమ్మద్ నబీ తర్వాత ఐపీఎల్ కాంట్రాక్టు దక్కించుకున్న రెండో ఆటగాడిగా రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో రషీద్ ఖాన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 4 కోట్లకు తిరిగి దక్కించుకున్న సంగతి తెలిసిందే.