ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్:
మహమ్మారి కరోనాపై చేస్తున్న పోరు నేపథ్యంలో దేశంలోని క్రీడా ప్రముఖులతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. సచిన్తో సహా 40 మందికి పైగా క్రీడా ప్రముఖులతో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా సలహాలు, సూచనలు చేస్తూ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మైదానంలో మీరు చూపించే తెగువ, పట్టుదల.. కరోనా వైరస్పై పోరాటంలోనూ చూపించాలని ఆయన కోరారు. దీనిపై సచిన్ స్పందించారు.
కరోనా జాగ్రత్తలు తప్పక పాటించాలి:
'లాక్డౌన్ తర్వాత కూడా ప్రజలు అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అది కీలక సమయం. కరచాలనం బదులుగా సామాజిక దూరం పాటిస్తూ.. నమస్తేతో పలకరించాలి. ప్రస్తుతం శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. దేశమంతా ఐక్యంగా ఉండాల్సిన సమయం ఇది. క్రీడలలో జట్టుగా మ్యాచ్ను గెలిచినట్లే.. మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడు దేశమంతా జట్టుగా పోరాడాలి. ఏప్రిల్ 14 తర్వాత కూడా కరోనా జాగ్రత్తలు అందరూ తప్పక పాటించాలని మోదీ వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారు. పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఈ సమయంలో వారి అనుభవాలు తెలుసుకోవాలన్నారు' అని సచిన్ తెలిపారు.
బయట తిరిగేందుకు సెలవులు కాదు:
తాజాగా సచిన్ ట్విటర్ వేదికగా ఓ వీడియో పంచుకున్నారు. 'ప్రభుత్వం ఎంత చెబుతున్నా.. కొందరు సీరియస్గా తీసుకోవడం లేదు. బయట తిరిగేందుకు ఇవి సెలవులు కాదు. బయటకి రావోద్దని ప్రభుత్వ ఆదేశాలు ఉన్న కూడా వాటిని పాటించకుండా ఎందుకు బయటకు వస్తున్నారు. కరోనా మహమ్మారితో యావత్ దేశం మొత్తం ప్రమాదకర పరిస్థితిల్లో ఉంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి' అని అన్నారు.
రూ. 50 లక్షలు విరాళం:
కరోనాపై పోరులో ప్రభుత్వాలకు ఆర్థికపరంగా తన వంతు చేయూతనందించేందుకు సచిన్ టెండూల్కర్ ఇటీవలే ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి విపత్కర స్థితిలో తన తరఫు నుంచి రూ. 50 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు సచిన్ ప్రకటించారు. ఇందులో రూ.25 లక్షలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి, మరో రూ. 25 లక్షలు ప్రధానమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు సచిన్ సన్నిహితుడొకరు వెల్లడించారు.