రెండో పరుగు కోసం యత్నించిన సచిన్
పాక్ పేసర్ వసీం అక్రమ్ వేసిన బంతిని బౌండరీ లైన్ వద్దకు తరలించిన సచిన్ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే, బంతిని అందుకున్న నదీమ్ ఖాన్ బౌండర్ లైన్ నుంచి నేరుగా వికెట్లను గిరాటేశాడు. మరోవైపు... సచిన్ క్రీజులోకి చేరుకునే ప్రయత్నంలో అక్తర్ను ఢీకొట్టాడు. సచిన్ బలంగా ఢీ కొట్టడంతో అక్తర్ కిందపడి విలవిల్లాడిపోయాడు. సచిన్ ఔట్ అయ్యాడంటూ పాక్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు.
టీవీ రీప్లేలో సచిన్ ఔట్
దీంతో ఫీల్డ్ అంఫైర్లు దీనిపై సమీక్షించాల్సిందిగా థర్డ్ అంఫైర్కు నివేదించారు. టీవీ రీప్లేలో సచిన్ టెండూల్కర్ ఔటైనట్లు తేలడంతో క్రీజును వీడాడు. అయితే, సచిన్ ఔటైన తీరుని జీర్ణించుకోలేని ప్రేక్షకులు రెచ్చిపోయారు. షోయబ్ అక్తర్పై నీళ్ల బాటిళ్లు విసరుతూ ‘చీట్.. చీట్' అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆటకు గంటకు పైగా అంతరాయం కలిగింది. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది మైదానంలోకి వచ్చినప్పటికీ పరిస్థితి సద్దుమణగకలేదు.
స్టేడియం మొత్తం కలియ తిరిగిన సచిన్
దీంతో అప్పటి క్యాబ్ అధ్యక్షుడు జగ్మోహాన్ దాల్మియాతో కలిసి సచిన్ రంగంలోకి దిగాడు. స్టేడియంలోకి వచ్చిన మొత్తం కలియ తిరుగుతూ శాంతించాల్సిందిగా ప్రేక్షకులను కోరాడు. దీంతో ఆట తిరిగి కొనసాగింది. ఆట మళ్లీ మొదలైన కాసేపటికే షోయబ్ బౌలింగ్లో రాహుల్ ద్రవిడ్ అవుటయ్యాడు. ఆ తర్వాత వెనువెంటనే అజారుద్దీన్, నయన్ మొంగియా కూడా ఔటయ్యారు.
ఈడెన్ గార్డెన్స్లో విధ్వంసం
భారత్ విజయానికి 65 పరుగులు కావాల్సి రాగా, చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. అయితే ఐదో రోజు భారత బ్యాట్స్మన్ వికెట్లు కాపాడుకోవడంలో విఫలమవడంతో పాక్ విజయం సాధించింది. పాకిస్థాన్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేని భారత అభిమానులు మరోసారి రెచ్చిపోయారు. ఈడెన్ గార్డెన్స్లో విధ్వంసం సృష్టించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లపైకి ప్లాస్టిక్ బాటిళ్లు, న్యూస్పేపర్లు, రాళ్లను మైదానంలోకి విసిరి గందరగోళం సృష్టించారు.