
హైదరాబాద్: ఆరు వన్డేల సిరిస్లో భాగంగా డర్బన్లోని కింగ్స్మీడ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు అత్యత్తమ ప్రదర్శన కనబరిచిందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
తొలి వన్డేలో కోహ్లీ, రహానేల కీలక భాగస్వామ్యం టీమిండియాను విజయతీరాలకు చేర్పించిందని కొనియాడాడు. తొలి వన్డే బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్, చహల్లు రాణించగా... కోహ్లీ, రహానేలు బ్యాటింగ్లో సత్తా చాటారని తెలిపాడు. 'బాగా ఆడారు, ఇలాగే విజయాల పరంపరను కొనసాగించండి' అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
తొలి వన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (112 బంతుల్లో 120; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీని నమోదు చేశాడు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, యజువేంద్ర చహల్లు 2 వికెట్లు తీశారు. వీరిద్దరు 20 ఓవర్లలో కేవలం 79 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీయడం విశేషం. అనంతరం 270 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 45.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
కెప్టెన్ విరాట్ కోహ్లీ (112) వన్డేల్లో 33వ సెంచరీని నమోదు చేయగా, రహానే (79) పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాజా విజయంతో ఆరు వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఆదివారం (ఫిబ్రవరి 4)న సెంచూరియన్ వేదికగా రెండో వన్డే జరగనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.