ముచ్చటగా మూడోసారి
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు లాక్డౌన్ పొడగించడంతో ఈనెల 17 వరకు అమల్లో ఉంది. లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా నిరుపేదలు, వలస కూలీలు తినడానకి తిండి దొరక్క, చేయడానికి పని లేక ఆకలితో అలమటిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేదలు, వలసకూలీలకు అండగా నిలుస్తున్న ముంబైలోని హైఫైవ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థకు మాస్టర్ భారీ మొత్తాన్ని అందజేశారు.
4వేల మంది పేదలకు సచిన్ సాయం
సచిన్ అందించిన మొత్తాన్ని 4000 మంది నిరుపేదలతో పాటు బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల కోసం ఖర్చు చేయాలని మాస్టర్ బ్లాస్టర్ సూచించినట్టు హైఫైవ్ ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. గత నెలలో 5 వేల మంది నిరుపేదలకు సాయం చేసేందుకుగాను ఆప్నాలయా అనే స్వచ్ఛంద సంస్థకు సచిన్ నిధులిచ్చారు. ఇక అంతకుముందు పీఎం కేర్స్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షల చొప్పున సాయం చేసిన సంగతి తెలిసిందే. మనదేశంలో ఇప్పటివరకు 59,800కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. దాదాపు 2000 వేల మంది మరణించారు.
సహాయం చేయడంలో సచిన్ ఎప్పుడూ ముందే
ఎప్పటినుండో సచిన్ టెండూల్కర్ చాలా ఛారిటీ సంస్థలకు తన వంతు సాయం చేసేవారు. ప్రజలకు సహాయం చేయడంలో ఎప్పుడూ సచిన్ ముందుంటారు. అయితే ఇది ఎప్పుడూ ప్రజల దృష్టికి మాత్రం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటానికి తమ వంతు సాయం అందించేందుకు ఇప్పటికే పలువురు క్రీడాకారులు ముందుకొచ్చారు. పఠాన్ సోదరులు, ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా, గౌతమ్ గంభీర్, మిథాలీ రాజ్, పీవీ సింధు, సానియా మీర్జా, రోహిత్ శర్మ ఇలా చాలా మంది సాయం చేసారు.
బయట తిరిగేందుకు సెలవులు కాదు
సచిన్ ఒకవైపు సాయం చేస్తూనే మరోవైపు వైరస్పై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కోసారి సీరియస్ కూడా అయ్యారు. 'ప్రభుత్వం ఎంత చెబుతున్నా.. కొందరు సీరియస్గా తీసుకోవడం లేదు. బయట తిరిగేందుకు ఇవి సెలవులు కాదు. బయటకి రావోద్దని ప్రభుత్వ ఆదేశాలు ఉన్న కూడా వాటిని పాటించకుండా ఎందుకు బయటకు వస్తున్నారు. కరోనా మహమ్మారితో యావత్ దేశం మొత్తం ప్రమాదకర పరిస్థితిల్లో ఉంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి' అని పేర్కొన్నారు.