అడిలైడ్: ఐసీసీ వరల్డ్ కప్లో భాగంగా బంగ్లాదేశ్ జట్టు క్వార్టర్ ఫైనల్స్లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. అగ్రశ్రేణి జట్లున్న గ్రూప్ ఏ నుంచి నాకౌట్ దశకు బంగ్లాదేశ్ చేరడమంటే మామూలు విషయం కాదు.
ముఖ్యంగా ఇంగ్లాండ్ లాంటి అగ్రశ్రేణి జట్టుని బంగ్లాదేశ్ వరల్డ్ కప్ నుంచి ఇంటికి పంపడంతో స్వదేశంలో జట్టుపై అభినందనల వర్షం కురుస్తోంది. మార్చి 9న అడిలైడ్లో బంగ్లాదేశ్ Vs ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి కారకుడైన పేసర్ రూబెల్ హుస్సేన్ (25)ను అభినందిస్తున్నారు.
ఒక్క మ్యాచ్తో బంగ్లాదేశ్లో హీరో అయిపోయాడు. వరల్డ్ కప్కి ముందు అతను అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అని కూడా చూడకుండా క్రికెట్ అభిమానులు అతన్ని ఆకాశానికెత్తేస్తున్నారు.
అయితే రూబెల్ హుస్సేన్ సంతోష పడాల్సిన విషయం ఏమిటంటే... వరల్డ్ కప్కి ముందు హుస్సేన్పై అత్యాచార ఆరోపణలు చేసిన బంగ్లాదేశ్ నటి నజ్నీన్ అక్తర్ (19) కేసును ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. గతంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని హుస్సేన్పై కేసు పెట్టిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్కు వెళ్లేముందు రూబెల్ కొన్ని రోజులు జైల్లో ఉన్నాడు.
దీంతో వరల్డ్ కప్కు వెళ్లేది కూడా అనుమానంగా మారినా, దేశ ప్రయోజనాలు దృష్ట్యా అతనికి వరల్డ్ కప్ ముగిసేంతవరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంగ్లాండ్తో మ్యాచ్ అనంతరం నజ్నీన్ ఓ టీవీ ఛానెల్తో మాట్లాడుతూ తాను హుస్సేన్ని క్షమించేశానని, కేసుని ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది.