మే30 నుంచి వరల్డ్ కప్
మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్కప్ జరగనున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఆటగాడిగానే కాకుండా కెప్టెన్గా ఏమేరకు ఐపీఎల్లో రాణిస్తాడన్నది అందరి ఆసక్తి. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించిన టీమిండియా స్వదేశంలో మాత్రం ఐదు వన్డేల సిరిస్ను 2-3తేడాతో చేజార్చుకోవడాన్ని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు.
ఆసీస్ చేతిలో ఓటమి
వరల్డ్ కప్కు ముందు సన్నాహకంగా జరిగిన ఐదు వన్డేల సిరీస్లో ఆసీస్ చేతిలో ఓడడం అనూహ్య పరిణామం. దీంతో వన్డే వరల్డ్కప్లోనూ ఇదే ఒరవడి కొనసాగుతుందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ జట్టు కెప్టెన్గా రాణించడంతో పాటు ఆ జట్టుని విజేతగా నిలపడం కోహ్లీకి అవసరం.
ధోనీ సూచనలు, సలహాలతోనే
అంతేకాదు ధోనీ సూచనలు, సలహాలతోనే ఇంతకాలం విజయాలందుకున్నాడన్న అపప్రథనుకూడా కోహ్లీ తొలిగించుకోవాల్సి ఉంది. ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా సోమవారం విరాట్ కోహ్లీ తన జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశాడు. ఇందుకు సబంధించిన ఫొటోలను కోహ్లీ ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
ఇప్పటివరకూ మూడు ఫైనల్స్లో ఆడిన కోహ్లీ
ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీ తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ మూడు ఫైనల్స్లో ఆడాడు. ఈ మూడు మ్యాచుల్లో ఆర్సీబీ ఓటమిపాలైంది. తొలిసారి 2009లో డెక్కన్ చార్జర్స్ చేతిలో ఓటమిపాలైనప్పుడు కోహ్లీ యువ ఆటగాడిగా ఉన్నాడు. తర్వాత 2011లో రెండోసారి ఫైనల్ చేరినప్పుడు టీమిండియా వరల్డ్కప్ జట్టులో ఒకడిగా ఉన్నాడు. మూడోసారి తన కెప్టెన్సీలో 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది.