200 పరుగులు దాటించిన శామ్ కర్రన్
నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఓ దశలో ఇంగ్లండ్ స్కోరు 86/6. స్టోక్స్ సహా టాపార్డర్ మొత్తం పెవిలియన్కు చేరారు. చివర్లో క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ, శామ్ కర్రన్ ఏడో వికెట్కు 81 పరుగులు జోడించి ఆ జట్టుని పటిష్ట స్థితిలో నిలిపారు. ఆ తర్వాత శామ్ కర్రన్ నిలకడగా భారత బౌలింగ్ను ఎదుర్కొని ఇంగ్లాండ్ స్కోరు బోర్డుని 200 పరుగులు దాటించాడు. చివరి నాలుగు వికెట్లకు 160 పరుగులు జమకాగా, ఇందులో దాదాపు సగం పరుగులు శామ్ కర్రన్ సాధించినవే.
6 నుంచి 9 స్థానాలు ఎంతో కీలకం
ఇక భారత్ ఇన్నింగ్స్లో 6 నుంచి 9 స్థానాల్లో బ్యాటింగ్కు దిగిన బ్యాట్స్మెన్ చేసిన పరుగులు ఐదు. పుజారాకు ఇషాంత్ తోడుగా నిలవడంతో 200 పరుగులు దాటించారు లేకుంటే 200 పరుగులు కూడా కష్టమయ్యేది. ఇక, నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో కూడా ఇలానే జరిగింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ బౌలర్లను జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, శామ్ కర్రన్ దెబ్బకొట్టారు. 6, 7 వికెట్లకు ఈ ముగ్గురు కలిసి 111 పరుగులు జోడించారు. ఇదే స్థానాల్లో భారత్ రెండో ఇన్నింగ్స్లో జతయినవి 27 పరుగులే కావడం గమనార్హం.
అశ్విన్కు ఏమైంది?
ఓవైపు మొయిన్ అలీ తన ఆఫ్ స్పిన్తో మొదటి ఇన్నింగ్స్లో భారత లోయరార్డర్ను కుప్పకూల్చి, రెండో ఇన్నింగ్స్లో కోహ్లీ, రహానేలను పెవిలియన్కు చేర్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో అశ్విన్ కంటే అతడే మెరుగైన స్పిన్నర్ అని నిరూపించుకున్నాడు. మూడో రోజు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో 33 ఓవర్లు వేసినా అశ్విన్ ఒకే ఒక్క వికెట్ తీశాడు. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో అశ్విన్ ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. దీనిని బట్టి మూడో టెస్టు సందర్భంగా అయిన తుంటి గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోకున్నా ఆడిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
పాండ్యా పేలవ ప్రదర్శన
మరోవైపు మూడో టెస్టులో ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా నాలుగో టెస్టులో ఒక్క వికెట్ మాత్రమే తీసి, ఐదు పరుగులే చేసి అటు బౌలింగ్తో పాటు, ఇటు బ్యాటింగ్లోనూ తీవ్రంగా నిరాశపర్చాడు. పాండ్యా రాణించి ఉంటే జట్టు పరిస్థితి మరోలా ఉండేది. భారత జట్టు వైఫల్యంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా భాగస్వామ్యమే ఎక్కువగా ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు టీమిండియాలో అతడిని ఎందుకు ఉంచాలో కారణం చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు.
భారత ఓపెనర్లు పూర్తిగా విఫలం
నాటింగ్హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలతో ఫర్వాలేదనిపించిన ఓపెనర్లు ధావన్, రాహుల్ సౌతాంప్టన్ టెస్టులో మళ్లీ నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్లో కాస్త ఫరవాలేదనిపించినప్పటికీ, రెండో ఇన్నింగ్స్లో పేలవ ప్రదర్శన చేశారు. ఒక రకంగా చెప్పాలంటే టీమిండియా ఓటమికి వీళ్లు కూడా కారణమయ్యారు.