ఆక్లాండ్: టీమిండియా ప్రత్యేకమైన జట్టు, ప్రపంచంలోనే నంబర్వన్ టీమ్. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో ఘోర పరాభవం (వైట్వాష్) చెందాం. అయితే భారత్తో జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్లో సొంతగడ్దపై రెచ్చిపోతాం అని న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్మన్ రాస్ టేలర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు జరగనున్నాయి. ఈ నెల 24న తొలి టీ20 మ్యాచ్తో పోరు మొదలవుతుంది.
పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ ఆవేదన.. పాక్ జట్టులో ఆడాలంటే భారత్కి వెళ్లి ఆడాలా?!!
తొలి టీ20 మ్యాచ్ కోసం న్యూజిలాండ్ ఆటగాళ్లు మంగళవారం ప్రాక్టీస్ చేసారు. ఈ సందర్భంగా రాస్ టేలర్ అక్కడి స్థానిక మీడియాతో పలు విషయాలు పంచుకున్నాడు. ముందుగా ఈనెల 24 నుంచి స్వదేశంలో భారత్తో తలపడే పరిమిత ఓవర్ల క్రికెట్పై స్పందించాడు. టేలర్ మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో 0-3 తేడాతో ఓడిపోయాం. టెస్టు సిరీస్లో మేం అన్ని విభాగాల్లో విఫలం అయ్యాం. అయితే ఇప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చాం. ఇక్కడి పరిస్థితిపై పూర్తి అవగాహన ఉంది' అని అన్నాడు.
'టీమిండియా మాకు ప్రత్యేకమైన జట్టు. ప్రపంచంలోనే నంబర్వన్ టీమ్. ఇందులో సందేహమే లేదు. గతకొంత కాలంగా అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తోంది. అయితే సొంతగడ్దపై మేం రెచ్చిపోతాం. టీమిండియా సిరీస్ విజయాలకు అడ్డుకట్ట వేస్తాం. ఈ పర్యటనలో టీ20లు, వన్డేలు, టెస్టులు ఆడాల్సి ఉంది. తొలుత పరిమిత ఓవర్ల క్రికెట్పై దృష్టిసారిస్తాం. తర్వాత సుదీర్ఘ ఫార్మాట్ గురించి ఆలోచిస్తాం' అని టేలర్ పేర్కొన్నాడు.
టేలర్ టీ20 క్రికెట్పై స్పందిస్తూ... '2007లో దక్షిణాఫ్రికాలో తొలి టీ20 ప్రపంచకప్ జరిగింది. ఆ టోర్నీ జరుగుతున్నప్పుడు కొత్త ఫార్మాట్ నుంచి ఏం ఆశించాలో చాలా మంది క్రికెట్ అభిమానులకు తెలియదు. అలాంటి పరిస్థితుల నుంచి ఎక్కడికో వెళ్ళింది. టీ20 క్రికెట్కు జనాల్లో బాగా ఆదరణ పెరిగింది. ఇక ఐపీఎల్ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అన్ని జట్లూ టీ20లు ఆడుతున్నాయి. ఈ సిరీస్లోనే మేం ఐదు మ్యాచ్లు ఆడుతున్నాం. ఇది టీ20 ప్రపంచకప్కు ఉపయోగపడుతుంది' అని టేలర్ చెప్పుకొచ్చాడు.
ఈ సిరీస్ కోసం మంగళవారం భారత క్రికెట్ జట్టు కివీస్ గడ్డపై అడుగుపెట్టింది. ఆక్లాండ్ చేరుకున్నామంటూ కెప్టెన్ విరాట్ కోహ్లీ సహచర ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకుర్లతో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నాడు. 'ఆక్లాండ్ చేరుకున్నాం. లెట్స్ గో శార్దూల్ ఠాకుర్, శ్రేయస్ అయ్యర్' అని కోహ్లీ పోస్టు చేశాడు.