మరో 128 పరుగులు చేస్తే:
తొలి వన్డే నేపథ్యంలో టీమిండియా బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అరుదైన రికార్డులకు చేరువలో ఉన్నారు. రోహిత్.. పాంటింగ్ రికార్డుపై కన్నేయగా, కోహ్లీ.. సచిన్ రికార్డుపై కన్నేశాడు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్లలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సచిన్ (3077 ) అగ్రస్థానంలో ఉండగా.. పాంటింగ్ ( 2164) రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో రోహిత్ (2037) ఉన్నాడు. ఈ సిరీస్లో రోహిత్ 128 పరుగులు చేస్తే.. పాంటింగ్ను అధిగమిస్తాడు.
సచిన్ రికార్డుపై కోహ్లీ కన్ను:
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ (9) తొలి స్థానంలో నిలవగా.. కోహ్లీ (8) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ 71 మ్యాచ్ల్లో 9 శతకాలు సాధించగా.. కోహ్లీ 37 మ్యాచ్ల్లో 8 శతకాలు చేసాడు. మరోవైపు రోహిత్ 37 మ్యాచ్ల్లో 7 శతకాలు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్లో సచిన్ రికార్డు బద్దలు కొట్టడానికి కోహ్లీ-రోహిత్లకు అవకాశం ఉంది.
మరో సెంచరీ:
భారత్లో వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ (20 సెంచరీలు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, ఇప్పుడు ఆ రికార్డుకి ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ చేరువయ్యాడు. స్వదేశంలో ఇప్పటివరకు 19 సెంచరీలు చేసిన కోహ్లీ.. మరో సెంచరీ చేస్తే సచిన్ సరసన నిలుస్తాడు.
సిరీస్ పట్టాలని భారత్:
గతేడాది భారత్లో పర్యటించిన ఆసీస్ 5 వన్డేల సిరీస్ను 3-2తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు వన్డేలు గెలిచిన భారత్.. ఆపై జరిగిన మూడు వన్డేలలో ఓడింది. అయితే ఇప్పుడు కంగారూలపై ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా ఏ విభాగంలో చూసుకున్నా ఇరుజట్లు సమ ఉజ్జీలుగా కనపిస్తుండటంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.