దుబాయ్: మంగళవారం ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2020 విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ముంబై వరుసగా రెండో ఏడాది టీ20 లీగ్ ఛాంపియన్గా నిలవడమే కాకుండా.. ఐదోసారి విజేతగా అవతరించింది. దీంతో ఆ జట్టు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లు, మేనేజ్మెంట్ను ఉద్దేశించి మాట్లాడాడు. ముందుగా అందరికీ కంగ్రాట్స్ తెలిపిన రోహిత్.. ఈ సీజన్ తమకు అద్భుతంగా సాగిందన్నాడు. టోర్నీ జరిగినన్ని రోజులూ క్రమశిక్షణతో మెలిగారని సభ్యులను అభినందించాడు. ఈ సీజన్ ఆగస్టులో మొదలు కాలేదని.. అంతకంటే ఐపీఎల్ కోసం తమ సన్నద్ధత మొదలైందని రోహిత్ తెలిపాడు.
ఆటగాళ్లతో రోహిత్ శర్మ మాట్లాడిన ఈ వీడియోను ముంబై ఇండియన్స్ గురువారం ట్వీట్ చేసింది. డ్రెస్సింగ్ రూమ్లో ముంబై కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ... 'ముందుగా అందరికి అభినందనలు. ఇదో గొప్ప సీజన్. మన సీజన్ ప్రారంభమైంది ఆగస్టులో కాదు.. అంతకన్నా ముందు జూన్లోనే. లాక్డౌన్ లాంటి కష్టతరమైన సమయంలోనే అది మొదలైంది. యూఏఈకి వచ్చాక అందరికీ ఇక్కడి వాతావరణం కొత్తగా అనిపించింది. హోటల్ నుంచి బయటకు వెళ్లే అవకాశం లేకపోయింది. అలంటి పరిస్థితుల్లో కూడా ఆటగాళ్లంతా క్రమశిక్షణతో మెలిగారు. హోటల్ గదులకే పరిమితమయ్యారు. మైదానంలోనూ ఎంతో నిబద్ధతగా కొనసాగారు. అందుకే ఇప్పుడు ట్రోఫీతో నిలిచాం' అని పేర్కొన్నాడు.
'ఈ సీజన్లో ఆడే అవకాశం రాని వారికి ధన్యవాదాలు. తుది జట్టులో లేమనే నిరాశ చెందకుండా.. నిరంతరం అండగా నిలిచారు' అని ముంబై సారథి రోహిత్ శర్మ అన్నాడు. ఆటగాళ్లు, మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్కు రోహిత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. లీగ్ దశలో గాయం బారిన పడిన తాను త్వరగా కోలుకునేందుకు వారు కృషి చేశారని చెప్పాడు. రోహిత్ గాయం కారణంగా 4 మ్యాచ్లకు దూరం అయ్యాడు. ఆపై సన్రైజర్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచిన రోహిత్.. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 51 బంతుల్లో 68 రన్స్ చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ 2020 అనంతరం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. గాయం కారణంగా వన్డే, టీ20 సిరీస్లకు రోహిత్ శర్మను ఎంపిక చేయని సంగతి తెలిసిందే. టెస్టు సిరీస్కు మాత్రం సెలక్టర్లు రోహిత్ను ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకొంటున్న రోహిత్ శర్మ పునరావాసం కోసం బెంగళూరులోని ఎన్సీఏకు చేరుకోనున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్తాడు.
షోయబ్ మాలిక్కు బిగ్ షాక్.. పోమ్మనలేక పొగ పెడుతున్న పీసీబీ!!