
హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదో వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికాకు 275 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ సిరిస్లో ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఘోరంగా విఫలమైన రోహిత్ శర్మ ఐదో వన్డేలో మాత్రం సెంచరీ నమోదు చేశాడు.
తన ఫామ్పై వస్తున్న తీవ్ర విమర్శలకు రోహిత్ శర్మ సెంచరీతో సమాధానం చెప్పాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 17వ సెంచరీ. ఈ మ్యాచ్లో మొత్తం 126 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ మర్క్రమ్... కోహ్లీసేనను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
దీంతో తొలుత క్రీజులో కుదురుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చి రోహిత్ శర్మ ఆ తర్వాత నిలకడగా ఆడుతూ పరుగుల వరద పారించాడు. తొలి వికెట్కు ఓపెనర్ శిఖర్ ధావన్(34)తో కలిసి 48 పరుగులు జోడించిన రోహిత్ శర్మ.. ఆతర్వాత కెప్టెన్ కోహ్లీతో కలిసి 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఈ మ్యాచ్లో కోహ్లీ-రోహిత్ శర్మల మధ్య మరోమారు సమన్వయ లోపం ఏర్పడింది. అనవసరపు పరుగుకోసం రోహిత్ శర్మ ఇచ్చిన సూచనతో ముందుకు వెళ్లిన కోహ్లీ రనౌట్గా పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ కారణంగా కోహ్లీ రనౌట్ కావడం ఇది ఏడోసారి. అయితే, కోహ్లీని రనౌట్ చేసిన ప్రతిసారీ రోహిత్ శర్మ సెంచరీలతో చెలరేగాడు.
రెండుసార్లు డబుల్ సెంచరీలు సాధించగా, రెండుసార్లు సెంచరీలు సాధించాడు. కోహ్లీ రనౌట్కు కారణమైన ప్రతిసారీ రోహిత్ శర్మ చేసిన స్కోర్లు వరుసగా 57, 209, 264, 124, తాజాగా ఐదో వన్డేలో 115 పరుగులు నమోదు చేశాడు. కాగా, కోహ్లీ(36) రెండో వికెట్గా ఔటైన తర్వాత భారత్ స్కోరులో వేగం తగ్గింది. ఈ మ్యాచ్లో రహానే(8) కూడా రోహిత్ శర్మతో సమన్వయ లోపంతో రనౌటయ్యాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.