బయటవారికి ఏం తెలుసు..
'టీమిండియా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో మేము పట్టించుకోవడం లేదు. అసలు క్రికెట్ ఎక్స్పర్ట్స్ ఎవరో నాకు తెలియదు. వారిని ఎందుకు అలా పిలుస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. వారు బయట నుంచి చూస్తున్నారు. టీమిండియాలో ఏమి జరుగుతుందో వారికి తెలియదు. మేము ప్రపంచకప్ లక్ష్యంగా ఒక జట్టును తయారు చేసుకొంటున్నాం. అనేకసార్లు చర్చించిన తర్వాతే మార్పులపై నిర్ణయాలు తీసుకుంటున్నాము. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాము. ఈ విషయాలన్నీ బయట వారికి తెలియవు.'అని క్రికెట్ విమర్శకుల ప్రశ్నలకు రోహిత్ సమాధానమిచ్చాడు.
కోహ్లీ ఓ లెజెండ్..
విరాట్ కోహ్లీ ఫామ్ గురించి స్పందిస్తూ..'ప్రతీ ఆటగాడు ఏదో ఒక సమయంలో ఫామ్ కోల్పోతాడు. ఆ తర్వాత పుంజుకొని తిరిగి ఫామ్లోకి వస్తాడు. అయితే, ఆటగాడి నాణ్యత మాత్రం ఎప్పుడూ తగ్గదు. కోహ్లీ ఫామ్కి సంబంధించి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నేను కూడా ఒక దశలో ఫామ్ కోల్పోయాను. చాలా మంది ఆటగాళ్లకు ఈ విధంగా జరిగింది. ఇదేమీ కొత్త కాదు. ఎంతోకాలంగా నిలకడగా రాణిస్తున్న ఆటగాడు ఒకటి లేదా రెండేళ్ల పాటు పరుగులు సాధించలేకపోతే అలా మాట్లాడకూడదు. అభిమానులు దీన్ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. కానీ, జట్టును నడుపుతున్న వారికి ఆ ఆటగాడి అవసరం, నాణ్యత తెలుసు.'అని కపిల్ దేవ్ వ్యాఖ్యలను ఉద్దేశించి రోహిత్ తెలిపాడు.
దూకుడే మా సూత్రం..
కోహ్లీ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించడం కోహ్లీ వ్యక్తిగత నిర్ణయమా? లేదా టీమ్మేనేజ్మెంట్ సూచనా? అని అడిగినప్పుడు రోహిత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. టీమ్ ప్రణాళికల్లో భాగంగానే విరాట్ అలా దూకుడా ఆడాడని చెప్పాడు. 'మేము ఒక నిర్దిష్టమైన విధానంలో ఆడాలనుకొన్నాము. దానికి ప్రతి ఆటగాడి సహకారం అవసరం. అలా అయితేనే ఫలితం సానుకూలంగా వస్తుంది. ఈ జట్టులో భాగమైన ఆటగాళ్లు అదనపు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సిరీస్లో మేము ఆ విధంగానే ఆడి గెలిచాము. ఈ ఆలోచనా విధానంతోనే టీమ్ఇండియా రాబోయే సిరీస్ల్లో కూడా ఆడుతుంది' అని రోహిత్ చెప్పాడు.
నాలుగు ఇన్నింగ్స్ల్లో విఫలం..
ఎన్నో అంచనాలతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన కోహ్లీ.. రీషెడ్యూల్డ్ టెస్టులో దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి అతను చేసిన మొత్తం పరుగులు కేవలం 31 మాత్రమే. ఇక మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మొదటి టీ20కి దూరంగా ఉన్న విరాట్.. తర్వాతి రెండు మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. తొలి మ్యాచ్లో ఒక పరుగు మాత్రమే చేసిన విరాట్.. రెండో టీ20లో 6 బంతుల్లో 6, 4 బాది ఔటయ్యాడు. రెండు మ్యాచ్ల్లో తన శైలికి భిన్నంగా దూకుడుగా ఆడే ప్రయత్నం చేసి విరాట్ ఔటవ్వడాన్ని విమర్శకులు తప్పుబట్టారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్లోనైనా విరాట్ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.