స్లో బౌన్సర్తో..
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఆడే ట్రెంట్ బౌల్ట్.. తన కెప్టెన్ రోహిత్ శర్మ బలహీనతపై దెబ్బకొట్టాడు. బౌన్సర్లను పుల్ షాట్గా మార్చుతూ పండుగచేసుకునే రోహిత్ను.. స్లో బౌన్సర్తో ఊరించి బోల్తా కొట్టించాడు. ఫైన్ లెగ్ ఫీల్డర్ను సర్కిల్ లోపలికని ఉంచి.. బంతి వేసే క్రమంలో వెనక్కు జరిపాడు. ఫీల్డర్ బయట పడేద్దామని భావించిన రోహిత్.. బౌల్ట్ వ్యూహాన్ని పసిగట్టలేక నిరాశగా వెనుదిరగాడు. అయితే ట్రెంట్ బౌల్ట్కు ఈ చిట్కా చెప్పింది తానేనని మ్యాచ్ అనంతరం రోహిత్ చెప్పాడు. ముంబై తరఫున ఇద్దరం ఇలాంటి బ్లఫ్స్ ఎన్నో చేశామని, ఇప్పుడు దాన్నే తనపై ప్రయోగించాడని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.
నేను చెప్పిన చిట్కానే..
'ట్రెంట్ బౌల్ట్తో కలిసి నేను చాలా మ్యాచ్లు ఆడాను. అతనికి నా బలహీనతలేంటో బాగా తెలుసు. అలాగే అతని వీక్నెస్ కూడా నాకు తెలుసు. ఈ క్రమంలోనే మా ఇద్దరి మధ్య ఆసక్తికర పోటీ ఉంటుంది. నన్ను ఔట్ చేయడానికి అతను ఏం చేస్తాడో నాకు బాగా తెలుసు. అతని కెప్టెన్గా నేను చెప్పిన చిట్కాలనే నాపై ప్రయోగించాడు. అతను బౌన్సర్ వేస్తాడని నేను ఊహించా. కానీ ఫీల్డర్పై నుంచి కొట్టి అతనికి షాకివ్వాలనుకున్నా. దురదృష్టవశాత్తు అలా జరగలేదు. కానీ గెలిచినందుకు సంతోషంగా ఉంది'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఇదో పాఠం..
ఇక రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఇన్నింగ్స్లతో భారత్ సునాయసంగా గెలుస్తుందని భావించినా చివర్లో న్యూజిలాండ్ మ్యాచ్ను మలుపు తిప్పి ఉత్కంఠను పెంచింది. అయితే ఈ మ్యాచ్ తమకు మంచి లెస్సన్ లాంటిదని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. 'విజయం కోసం ఆఖరి వరకు వేచి చూడాల్సి వచ్చింది. అంత సులువు కాదనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఆడని ఆటగాళ్లకు ఇదో మంచి గుణపాఠం. పవర్ హిట్టింగ్ అన్నిసార్లు పనికిరాదని ఈ మ్యాచ్తో మరోసారి తెలుసొచ్చింది. పరిస్థితులకు అనుగుణంగా ఫీల్డ్ సెటప్ గమనిస్తూ.. సింగిల్స్తో స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా ముఖ్యమే.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
సూర్య సూపరో సూపర్..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (42 బంతుల్లో 70; 3 ఫోర్లు, 4 సిక్స్లు), మార్క్ చాప్మన్ (50 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా... కెప్టెన్ రోహిత్ శర్మ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం రాంచీలో జరుగుతుంది.