
హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సోమవారం (ఏప్రిల్ 30)న 31వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ప్రస్తుత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. భారత జట్టుకు బీసీసీఐ అందించిన అత్యుత్తమ ఓపెనర్లలో రోహిత్ శర్మ ఒకడు.
అభిమానులు ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) చేసిన అరుదైన రికార్డు కూడా రోహిత్ శర్మ ఖాతాలోనే ఉంది. టెస్టు, వన్డే, టీ20 ఇలా మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్లో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఐదింట ఓటమి పాలై, కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి మూడో స్ధానంలో కొనసాగుతోంది.
'మా కెప్టెన్ ఈ ఏడాదంతా పరుగుల వరద పారించాలి. సెంచరీలు, సిక్స్లు.. ఇంకా ఎన్నెన్నో విజయాలు సాధించాలి. పుట్టిన రోజు శుభాకాంక్షలు రోహిత్ శర్మ' అంటూ ముంబై ఇండియన్స్ టీమ్ ట్వీట్ చేసింది.
'క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదించే రోహిత్ పేరులోనే హిట్ ఉంది. ఈ సంవత్సరమంతా నీకు సూపర్గా ఉండాలి. పుట్టిన రోజు శుభాకాంక్షలు రోహిత్' అంటూ టీమిండియా ఆల్రౌండర్ సురేశ్ రైనా అభినందనలు తెలిపారు.
రోహిత్ శర్మ పుట్టినరోజున సెహ్వాగ్ తనదైన శైలిలో ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పాడు. 'నా ఫేవరెట్ బ్యాట్స్మెన్. అతడి ఆటను నేను ఆస్వాదిస్తాను. నువ్వు ఇలాగే నీ ప్రతిభను పెంపొందించుకుంటూ ఆనందకరమైన జీవితాన్ని గడపాలి' అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.