హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న పింక్ బాల్ టెస్టు జట్టు నుంచి యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ను సెలక్టర్లు తప్పించారు. అతడి స్థానంలో వృద్దిమాన్ సాహాకు బ్యాకప్గా ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ను ఎంపిక చేశారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్కు పంత్ ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో అతడు రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు. వచ్చే నెలలో విండిస్తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్కు ఎంపికైన రిషబ్ పంత్ ప్రాక్టీస్ కోసం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు.
పింక్ బాల్ టెస్ట్, డే2: కోహ్లీ 27వ టెస్ట్ సెంచరీ, రికీ పాంటింగ్ రికార్డు బద్దలు
ఇదే విషయాన్ని సెలక్టర్లకు చెప్పడంతో ముస్తాక్ అలీ టోర్నీలో పంత్ ఆడేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అతడితో పాటు మరో రిజర్వ్ ఆటగాడు శుభ్మన్ గిల్ను సైతం తప్పించింది. "రిషబ్ పంత్, శుభమాన్ గిల్ తమ రాష్ట్రాల తరఫున సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో పాల్గొంటారు. రిషబ్ పంత్ స్థానంలో ఆంధ్రా కీపర్, బ్యాట్స్మన్ కేఎస్ భరత్ వృద్ధిమాన్ సాహాకు బ్యాకప్గా టీమిండియాతో కలిశాడు" అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
దీంతో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఢిల్లీ తరుపున పంత్, పంజాబ్ తరుపున గిల్ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో మిగిలిన రోజుల్లో సాహాకు బ్యాకప్గా కేఎస్ భరత్ కొనసాగనున్నాడు. అనూహ్యంగా పింక్ బాల్ టెస్ట్కు ఎంపిక కావడంపై కేఎస్ భరత్ సంతోషం వ్యక్తం చేశాడు.
కోహ్లీ కవర్ డ్రైవ్ని చప్పట్లతో అభినందించిన బంగ్లా బౌలర్ (వీడియో)
పింక్ బాల్ టెస్టులో చోటు దక్కకపోయినప్పటికీ... టీమిండియాతో ట్రావెల్ చేయడం ఎంతో కొంత తనకు ఉపయోగపడుతుందని కేఎస్ భరత్ అన్నాడు. దులీప్ ట్రోఫీ-2015లో భాగంగా పింక్ బాల్ క్రికెట్ ఆడిన ఆనుభవం ఉందని, తనకు అవకాశం లభిస్తే తప్పకుండా సత్తా చాటుతానని కేఎస్ భరత్ పేర్కొన్నాడు.