మోకాళ్లకు ఆపరేషన్లు..
కొత్త సంవత్సరానికి ముందు రూర్కీ సమీపంలో పంత్ వెళ్తున్న కారుకు భయంకరమైన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్కు స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన తర్వాత శస్త్రచికిత్స అవసరం ఉండటంతో అతన్ని ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడే అతనికి పలు ఆపరేషన్లు జరిగాయి. ముఖ్యంగా అతని మోకాళ్లకు శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది.
తొలిసారి స్పందించిన పంత్..
ఈ క్రమంలో ప్రమాదం తరువాత తొలిసారి సోషల్ మీడియాలో స్పందించిన పంత్.. తను కోలుకుంటున్నట్లు చెప్పాడు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అతను ఇంత త్వరగా కోలుకోవడంలో ప్రభుత్వం, బీసీసీఐ కీలక పాత్ర పోషించాయి. అతనికి కావలసిన అన్ని రకాల సేవలు నిమిషాల్లో అందేలా చర్యలు తీసుకున్నాయి. అయితే అతను కోలుకోవడానికి మాత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను కీలకం అనుకుంటే.. ఇప్పుడు ఆ సిరీస్కు పంత్ దూరమయ్యాడు. వచ్చే ఐపీఎల్లో కూడా పంత్ ఆడటం లేదని గంగూలీ ధ్రువీకరించాడు.
పంత్ ఏమన్నాడంటే?
'మీ అందరి మద్దతు, విషెస్ చూసి చాలా సంతోషిస్తున్నా. నాకు ఇంత ప్రేమ పంచినందుకు ధన్యవాదాలు. నా శస్త్రచికిత్స విజయంవంతంగా ముగిసిందని చెప్పేందుకు చాలా సంతోషిస్తున్నా. రికవరీ ప్రయాణం మొదలుపెట్టా. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు నేను సిద్ధం' అని ట్వీట్ చేశాడు పంత్. అలాగే తనకు సాయం చేసిన బీసీసీఐ, జై షా, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అతను ఈ ట్వీట్ చేసిన నిమిషాల్లోనే దీనికి 10 వేల పైగా లైకులు వచ్చాయి. అభిమానులంతా పంత్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.