వ్యూహాలు ఫలించలేదు:
ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పలువురు బీసీసీఐ అధికారులు హాజరయ్యారు. జట్ల సెలక్షన్ అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ వెస్టిండీస్ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదు. అతను టూర్కు అందుబాటులో ఉండను అని ముందే తెలిపాడు. ప్రపంచకప్ ముందే మా దగ్గర ప్రణాళికలున్నాయి. కానీ ప్రపంచకప్లో కొన్ని వ్యూహాలు ఫలించలేదు' అని ఎమ్మెస్కే తెలిపారు.
రిటైర్మెంట్ ధోనీ వ్యక్తిగతం
'యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం మా ప్రణాళిక అదే. ధోనీ భవిష్యత్తు గురించి అతనితో చర్చించాం. రిటైర్మెంట్ ధోనీ వ్యక్తిగత విషయం. ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలో ధోనీకి తెలుసు. కానీ మేం మా భవిష్యత్తు ప్రణాళికలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం' అని ఎమ్మెస్కే పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయం ఆలోచిస్తాం:
'ప్రపంచకప్లో ధోనీ స్ట్రైక్రేట్ గురించి ఆలోచించడం లేదు. ఫైనల్లో బాగా పోరాడాడు. జట్టు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని యువ ఆటగాళ్లను సిద్ధం చేసుకుంటున్నాం. రిషభ్ పంత్ మూడు ఫార్మాట్లు ఆడుతాడు. అతనిపై భారం పడకుండా చూసుకుంటాం. వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్లను ప్రత్యామ్నాయంగా ఆడించే ఆలోచనలో ఉన్నాం' అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చారు.
మూడు ఫార్మాట్లలో:
సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ వెస్టిండీస్ టూర్ నుండి స్వయంగా తప్పుకోవడంతో యువ ఆటగాడు రిషబ్ పంత్ను వికెట్ కీపర్గా ఎంపిక చేశారు. అయితే టెస్ట్లకు వృద్ధిమాన్ సాహాను ప్రత్యామ్నయ కీపర్గా ఎంపిక చేశారు. మూడు ఫార్మాట్లలోనూ పంత్ ఆడనున్నాడు.