
హైదరాబాద్: ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్లో టీమిండియా న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీస్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ ఓటమి అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీపై అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కెప్టెన్గా కోహ్లీని తొలగించాలని పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
అయితే, సెలక్షన్ కమిటీ వాటిని పట్టించుకోలేదు. వెస్టిండీస్ పర్యటనకు ఇటీవల ప్రకటించిన మూడు ఫార్మాట్లలో కోహ్లీనే కెప్టెన్గా వ్యవహరిస్తాడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. దీంతో ప్రపంచకప్లో టీమిండియా ప్రదర్శనపై ఒక్క రివ్యూ కూడా చేయకుండా కోహ్లీని తిరిగి కెప్టెన్ కొనసాగించడాన్ని సునీల్ గావస్కర్ తప్పుబట్టాడు.
ఇదొక కుంటి బాతు సెలక్షన్ కమిటీలా ఉందని... ముందుగా వెస్టిండీస్ పర్యటనకు కోహ్లి దూరం అవుతాడని సెలక్టర్లు చెప్పారని, అయితే, ఒక్కసారిగా విండీస్ పర్యటనకు కోహ్లినే కెప్టెన్ అంటూ ప్రకటించారంటూ మండిపడ్డాడు. సెలక్షన్ కమిటీ నిర్ణయం మేరకు కెప్టెన్ ఎంపిక జరిగిందా? లేక కోహ్లీ నిర్ణయం మేరకు కెప్టెన్ ఎంపిక జరిగిందా? అంటూ గవాస్కర్ ప్రశ్నించాడు.
కోహ్లీని తిరిగి కెప్టెన్గా ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ కనీస పద్ధతి పాటించలేదని, ఐదు నిమిషాలు కూడా సమావేశం నిర్వహించలేదని సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తనదైన శైలిలో ట్విటర్ వేదికగా స్పందించాడు.
"కోహ్లీని కెప్టెన్గా నియమిస్తూ భారత్ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని గవస్కర్ తప్పుబట్టడం సరికాదు. నేను గావస్కర్ వాదనను గౌరవంగా తిరస్కరిస్తున్నా. వరల్డ్కప్లో భారత జట్టు ప్రదర్శన మరీ అంత చెత్తగా లేదు. అదే సమయంలో టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శన బాగానే ఉంది. కెప్టెన్గా కోహ్లీ నియామకం సరైనదే. కాకపోతే సెలక్టర్లు చిత్తశుద్ధిగా వ్యవహరించడం చాలా ముఖ్యం" అని మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.