హైదరాబాద్: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీకి ఊరట లభించింది. షమీ భార్య హసీన్ జహాన్ చేసిన మ్యాక్స్ ఫిక్సింగ్ ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ(ఏసీయూ) నిర్ధారించిన నేపథ్యంలో అతడిని సెంట్రల్ కాంట్రాకులో కొనసాగించనున్నట్లు బీసీసీఐ గురువారం అధికారిక ప్రకటన చేసింది.
గతంలో ఉన్న విధంగానే షమీకి 'బి గ్రేడ్' కాంట్రాక్ట్ను బీసీసీఐ అందించింది. తద్వారా షమీ ఇతర ఆటగాళ్లతో పాటు రూ.3 కోట్లు వేతనంగా అందుకోనున్నాడు. అంతేకాదు ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్ టీమ్కు ఆడటానికి కూడా బోర్డు అంగీకరించింది. షమీ పాకిస్థాన్కు చెందిన అలీష్బా అనే మహిళ పంపిన డబ్బును షమీ దుబాయ్లో మహ్మద్ భాయ్ వ్యక్తి నుంచి తీసుకున్నట్లు హసీన్ జహాన్ ఆరోపించింది.
భార్య ఆరోపణలతో బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్ట్ ఆటగాళ్ల వివరాల జాబితా నుంచి షమీ పేరును తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ(ఏసీయూ) హెడ్ నీరజ్ కుమార్ విచారణ చేశారు. ఈ విచారణలో షమీ భార్య హసీన్ను, మహ్మద్ షమీని, ఆరోపణల్లో పేర్కొన్న వ్యక్తులను బీసీసీఐ అధికారులు ప్రశ్నించారు.
విచారణ పూరైన అనంతరం ఏసీయూ తన నివేదికను కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీఓఏ)కి సమర్పించింది. ఈ నివేదికలో షమీకి ఏసీయూ క్లీన్ చీట్ ఇవ్వడంతో బీసీసీఐ షమీకి తిరిగి కాంట్రాక్ట్ ఇచ్చింది. మరోవైపు షమీ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోల్కతా పోలీసులు అతడిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.