|
ఏదో రోజు ముగింపు పలకాల్సిందే..
ఈ క్రమంలోనే గతేడాది సురేశ్ రైనాను కాదని సీఎస్కే రాబిన్ ఊతప్పను కొనసాగించింది. ఒకటి రెండు ఇన్నింగ్స్లు బాగానే ఆడిన ఊతప్ప ఆ తర్వాత విఫలమయ్యాడు. అయినా ఓ సీనియర్ ప్లేయర్గా అతను ఈ సీజన్లో కూడా కొనసాగుతాడని భావించిన ఫ్యాన్స్కు రాబిన్ ఊతప్ప షాకిచ్చాడు. ట్విటర్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్లో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు.
'ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడం మొదలెట్టి 20 ఏళ్లవుతోంది. నా దేశానికి, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అత్యున్నత గౌరవం. పూర్తి ఒడుదొడుకులతో ఈ అద్భుత ప్రయాణం సాగింది. ఓ మనిషిగానూ ఎదగడంలో కీలక పాత్ర పోషించిన ఆట నాకు పూర్తి సంతృప్తినిచ్చింది. ఏదేమైనా అన్ని మంచి విషయాలకు ఓ ముగింపు ఉంటుంది.
నా కుటుంబం కోసమే..
ఓ గొప్ప హృదయంతో అన్ని రకాల భారత క్రికెట్ నుంచి రిటైరవ్వాలని నిర్ణయించుకున్నా. నా కుటుంబంతో సమయం గడుపుతూ నా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తా. నా క్రికెట్ కెరీర్లో అండగా నిలిచిన బీసీసీఐకి, ఆయా రాష్ట్రాల తరపున ఆడే అవకాశమిచ్చిన కర్ణాటక, సౌరాష్ట్ర, కేరళ క్రికెట్ సంఘాలకూ కృతజ్ఞతలు.
ఐపీఎల్లో ఆడిన జట్లు, ముఖ్యంగా నాకెన్నో మధురమైన జ్ఞాపకాలను ఇచ్చిన కేకేఆర్, సీఎస్కేకు రుణపడి ఉంటా. నా కోసం కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. నాకు మద్దతుగా నిలిచిన కోచ్లు, మార్గనిర్దేశకులు, సహచర ఆటగాళ్లకు ధన్యవాదాలు. డ్రెస్సింగ్ గదిని ఎంతగానో కోల్పోతా. మీరందరూ నా జీవితానికి విలువ చేకూర్చారు'అని ఊతప్ప భావోద్వేగానికి గురయ్యాడు.
డబ్బులు సంపాదించుకోవడానికే...
కుటుంబంతో గడిపేందుకే ఆటకు గుడ్ బై చెబుతున్నానని ఊతప్ప పేర్కొన్నా.. అసలు కారణం వేరే ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకున్నట్టు.. ఒంట్లో క్రికెట్ ఆడే సత్తువ ఉన్నప్పుడే డబ్బులు వెనకేసువాలని ఊతప్ప కూడా భావిస్తున్నాడని, ఐపీఎల్ మాదిరిగానే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్కు ఇప్పుడు భారీ గిరాకీ ఉన్న నేపథ్యంలో వాటిలో పాల్గొనేందుకే ఊతప్ప రిటైర్మెంట్ తీసుకున్నాడని సందేహిస్తున్నారు.
ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్, ఇంగ్లండ్ లో గతేడాది మొదలైన 'ది హండ్రెడ్' లీగ్, వెస్టిండీస్లో జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)తో పాటు వచ్చే ఏడాది రెండు కొత్త లీగ్ లు కూడా రాబోతున్నాయి.
మెంటర్గా సెకండ్ ఇన్నింగ్స్..
యూఏఈ వేదికగా ఇంటర్నేషనల్ టీ20 లీగ్, సౌతాఫ్రికా వేదికగా సౌతాఫ్రికా టీ20 లీగ్స్ జరగనున్నాయి. ఈ రెండు లీగ్స్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు జట్లను కొనుగోలు చేశాయి. ఈ క్రమంలోనే ఈ రెండు లీగ్స్ ఆడేందుకు ఊతప్ప సుముఖంగా ఉన్నాడని అతని సన్నిహితులు పేర్కొంటున్నారు.
ఆటగాడిగా కాకపోయినా.. మెంటార్, కోచ్గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాలనే ఆలోచనలో కూడా ఉన్నాడట. ఐపీఎల్ ఓనర్స్ ఫ్రాంచైజీలే కావడంతో వారికి చెందిన జట్ల సహాయక బృందంలో చేరాలనుకుంటున్నాడట. ఈ క్రమంలోనే బీసీసీఐ నుంచి ఎన్ఓసీ తెచ్చుకునేందుకే రిటైర్మెంట్ ప్రకటించాడని అతని సన్నిహితులు పేర్కొన్నారు.