
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభ సమయంలో బాధితుల పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచిన నటుడు సోనూ సూద్. దేశంలో కరోనా పంజా విసురుతున్న వేళ అభాగ్యులకు అండగా నిలుస్తూ 'రియల్ హీరో' అనిపించుకుంటున్నారు. కరోనా బాధితులు దేశంలో ఎక్కడ ఉన్నా వారికి అవసరమైన ఆర్థిక, వైద్య సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. లాక్డౌన్ కాలంలో వలస కార్మికులను ఆదుకుని హీరోగా అవతరించిన సోనూ సూద్.. విద్యార్థుల ఆన్లైన్ చదువులకు ఆటంకం రాకుండా అనేక చర్యలు తీసుకున్నారు.
కరోనా సంక్షోభ సమయంలో ఎంతో మందికి సాయం చేసిన సోనూ సూద్.. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాకు సాయం చేసి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. కేవలం 10 నిమిషాల్లోనే ఆక్సిజన్ సిలిండర్ను పంపి తనలోని మానవత్వాన్ని చూపారు. 'మీరట్లో ఉన్న మా ఆంటీ కోసం అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ కావాలి. ఆమె వయసు 65. తీవ్ర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో హాస్పిటల్లో ఉన్నారు' అని రైనా ట్వీట్ చేశాడు. మిస్టర్ ఐపీఎల్ ట్వీట్కు స్పందించిన సోనూ సూద్..'10 నిమిషాల్లోనే ఆక్సిజన్ సిలిండర్ అక్కడికి చేరుకుంటుంది భాయ్' అంటూ రిప్లై ఇచ్చారు.
కర్ణాటకలోని సోనూ సూద్ బృందం మంగళవారం సకాలంలో స్పందించి ప్రాణాపాయస్థితిలో ఉన్న 20-22 మంది ప్రాణాలను కాపాడింది. బెంగళూరులోని అరక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడిందని.. అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్లు కావాలంటూ సత్యనారాయణన్ అనే ఓ పోలీసు అధికారి కర్ణాటకలోని సోనూసూద్ బృందానికి అత్యవసర సందేశం పంపారు. ఆ ఆస్పత్రిలో ప్రాణవాయువు అందక అప్పటికే ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20-22 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అత్యవసర సందేశం అందుకున్న వెంటనే స్పందించిన సోనూ సూద్ బృందం కొన్ని నిమిషాల్లోనే అరక్ హాస్పిటల్కి 16 ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచింది.
కేవలం ఒక విద్యార్థిని కోసం మొత్తం గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించిన పెద్ద మనుసు సోనూ సూద్ సొంతం. ఇలా అనేక రకాలుగా గత ఏడాది కాలంగా నిరంతరాయంగా పూర్తి నిబద్ధతతో తన సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారు. ప్రజల కోసం తన ఆస్తులు తాకట్టుపెట్టి మరి అండగా నిలుస్తున్నారు. సోనూ సూద్ ఫౌండేషన్ పేరుతో పలు కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సోనూ సూద్ చేస్తున్న సాయంపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.