
హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు హెడ్ కోచ్ డానియేల్ వెటోరి, బౌలింగ్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్, ఫీల్డింగ్ కోచ్ ట్రెంట్ వుడ్హిల్లను ఆయా బాధ్యతలను తప్పించింది. ఐపీఎల్ 2018 సీజన్లో ఆర్సీబీ కనీసం నాకౌట్ స్టేజిని కూడా దాటలేపోయింది.
ఇందుకు గాను వీరిని తప్పిస్తూ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు ముంబై మిర్రర్ పేర్కొంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బౌలింగ్ మెంటార్గా ఉన్న ఆశిష్ నెహ్రాను మాత్రం కెప్టెన్ కోహ్లీ కోరిక మేరకు అలానే ఉంచినట్లు పేర్కొంది. ఆర్సీబీ జట్టుకు ప్రస్తుతం లండన్కు చెందిన డియాగో కంపెనీ యజమానిగా వ్యవహారిస్తోంది.
అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఉన్న సంజీవ్ చురివాలా స్థానంలో మాజీ బాస్ అమ్రిత్ థామస్ను భర్తీ చేశారు. ఈ మార్పులను ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీనే సూచించినట్లు ముంబై మిర్రర్ తన కథనంలో పేర్కొంది.
మరో వారం రోజుల్లో తొలగించిన వారి స్థానాల్లో కొత్త వారిని ఎంపిక చేయనున్నారు. ఆర్సీబీ హెడ్ కోచ్ రేసులో టీమిండియా మాజీ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్మన్ గ్యారీ కిరెస్టన్ ఉన్నారు. ప్రస్తుతం కిరెస్టన్ ఆర్సీబీ బ్యాటింగ్ కన్సల్టెంట్గా ఉన్నారు.
అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ను కలిగిన ఉన్నప్పటికీ, ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్లో ఆర్సీబీ ఆరో స్థానంలో నిలిచింది. మొత్తం 14 మ్యాచ్లాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం 6 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది.
ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా ఆర్సీబీ హెడ్ కోచ్ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, జస్టిస్ లోథా కమిటీ సూచనల ప్రకారం అది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు రానుందని అందుకే అతడు రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ సీజన్ నాటికి బ్రాడ్ హాగ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. 2018 సీజన్ ఆరంభంలో అద్భుత ప్రదర్శన చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లీగ్ జరిగే కొద్ది పేలవ ప్రదర్శన చేసి ఏడో స్థానంలో నిలిచింది.