జడేజా ఆసక్తికర పోస్టు:
కరోనా వైరస్ని కట్టడిచేయడానికి దేశంలో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో దానిపై అవగాహన కల్పించడానికి టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. దేశంలోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండడానికి ఇన్స్టాగ్రామ్లో ఒక ఆసక్తికర పోస్టు పెట్టాడు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రజలు 21 రోజులు ఇళ్లలోనే ఉండాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వీడియో ద్వారా జడేజా చెప్పకనే చెప్పాడు.
రనౌట్ అవకండి:
గతేడాది భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడిన ఓ మ్యాచ్లో జడేజా ఆసీస్ బ్యాట్స్మన్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేశాడు. ఖవాజా త్వరగా సింగిల్ తీసేందుకు యత్నించగా.. అక్కడే ఉన్న జడేజా ఆ బంతిని అందుకొని నేరుగా నాన్స్ట్రైకర్ ఎండ్లో వికెట్లకు విసిరాడు. దీంతో ఆసీస్ బ్యాట్స్మన్ రనౌటయ్యాడు. ఆ వీడియోను పోస్టు చేసిన జడేజా.. 'జాగ్రత్తగా ఉండండి, ఇళ్లలోనే ఉండండి, రనౌట్ అవకండి' అని సరికొత్తగా హెచ్చరించాడు.
అభిమానులకు సూచనలు:
లెజెండ్ కపిల్దేవ్ సైతం ప్రజలను ఇళ్ల వద్దనే ఉండమని చెప్పాడు. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని కోరారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాక్డౌన్ ప్రకటనకు మాజీ క్రికెటర్ మొహమ్మద్ షమీ మద్ధతు ప్రకటించాడు. కరోనా కట్టడికి 21 రోజుల లాక్డౌన్ను పాటించి ఇంట్లోనే ఉండాలనే కేంద్ర ప్రభుత్వ సూచలను పాటించాలని షమీ తన అభిమానులను అభ్యర్థించాడు. ఇప్పటికే సచిన్, గంగూలీ, ద్రవిడ్, కోహ్లీ, రోహిత్, గంభీర్, ధావన్, సైనా, సింధు, సానియాలు అభిమానులకు సూచనలు చేసిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ ఒకసారి వాయిదా:
ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటికే ఐపీఎల్-13 ఒకసారి వాయిదా పడింది. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. మరోవైపు క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులతో సమయాన్ని ఆస్వాదిస్తుండగా, మరికొందరు తమ ఫిట్నెస్ను కాపాడుకుంటున్నారు. ఒకవేళ పరిస్థితులు త్వరగా చక్కబడి.. మళ్లీ క్రికెట్ ఆడే పరిస్థితులు ఎదురైతే అందుకు సిద్ధంగా ఉండాలని భావిస్తున్నారు.