

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో తొలి టీ20కి టీమిండియా సిద్ధమవుతోన్న సమయంలో ఆ ఫార్మాట్కు ఎంపిక కాని టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా ప్రధాన మంత్రి నరేందర్ మోడీని సతీసమేతంగా కలుసుకున్నాడు. మంగళవారం ప్రధాని కార్యాలయంలో జడేజా, రివాబాలు తనను కలుసుకున్నారని ఫొటోను మోడీ ట్వీట్ చేశారు.
'ప్రముఖ క్రికెటర్ జడేజా, అతడి భార్య రివాబాతో ముచ్చటించడం ఎంతో గొప్పగా ఉంద'ని కామెంట్ రాశారు. కానీ, ప్రధానిని జడేజా కలవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కొద్ది సిరీస్ల వరకూ దూరమైన జడేజా ఆసియా కప్ 2018 సందర్భంగా మళ్లీ టీమిండియాలో స్థానం దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్లో జరిగిన వన్డే మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసి అదే పర్యటనలో టెస్టు జట్టులోనూ ఆడాడు.
బంగ్లాదేశ్తో ఆడిన మ్యాచ్ల్లో నాలుగు వికెట్లు తీసి ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఇదే క్రమంలో వెస్టిండీస్తో టెస్టు, వన్డే ఫార్మాట్లలో ఆడి ఏడు వికెట్లు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లలో జడేజా కంటే కుల్దీప్ యాదవ్ ఎక్కువ వికెట్లు తీసుకోగా రెండో స్థానంలో జడేజా నిలిచాడు. కొన్ని మ్యాచ్ల నుంచి రవీంద్ర జడేజా నుంచి మెరుగైన ప్రదర్శన వస్తుండటంతో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు జట్టులోనూ చోటు సంపాదించుకున్నాడు.
అయితే జడేజా ఆటకు అనుగుణంగా లాంగ్ ఫార్మాట్కు ఎంపికయ్యాడే కానీ, టీ20లకు ఎంపిక కాలేకపోయాడు. ఈ క్రమంలో షార్ట్ ఫార్మాట్లోనూ చోటు దక్కించుకునేందుకు జడేజా ప్రయత్నం చేస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన కోహ్లీసేన మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్లు, మూడు వన్డేలు ఆడనుంది. టీ20 ఫార్మాట్లో తొలి మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం నుంచి జరగనుంది.