
హైదరాబాద్: టీమిండియా సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఇంగ్లాండ్ వేదికగా 2019లో జరిగే వరల్డ్ కప్లో ఆడాలనే ఆశలు ఉంటే వదులుకోవడం మంచిదని భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ సూచించాడు. ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సఫారీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
ఆరు వన్డేల సిరిస్లో మరో వన్డే మిగిలుండగానే 4-1తో కైవసం చేసుకుని సఫారీ గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టంచిన సంగతి తెలిసిందే. గత పాతికేళ్లలో ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డుని కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సాధించింది. ఈ విజయంలో భారత మణికట్టు స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించారు.
ఇప్పటివరకు ముగిసిన ఐదు వన్డేల్లో ఈ మణికట్టు స్పిన్నర్లు ఇద్దరూ కలిసి 30 వికెట్లు తీశారు. వన్డే, టీ20 జట్టులో మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్లు మెరుగ్గా రాణిస్తున్నారని, ఒకవేళ ఈ ఇద్దరిలో ఎవరైనా గాయపడితే తప్ప సీనియర్ స్పిన్నర్లకి మెగా టోర్నీలో ఆడే అవకాశం దక్కకపోవచ్చని అన్నాడు.
'టీమిండియా వన్డే, టీ20 జట్టులో మళ్లీ అశ్విన్, జడేజాలకి చోటు దక్కుతుందని చాలా మంది అంటున్నారు. కానీ.. ఆ సూచనలేవీ నాకు కనిపించడం లేదు. చాహల్ లేదా కుల్దీప్ గాయపడితే వారికి అవకాశం దక్కొచ్చు. టీమిండియా మేనేజ్మెంట్ 2019 వరల్డ్కప్ చాహల్, కల్దీప్లతో కనీసం 50-60 మ్యాచ్లు ఆడించేలా ప్రణాళిక చేస్తోంది' అని వాసన్ తెలిపాడు.
'ఈ క్రెడిట్ అంతా జట్టు మేనేజ్మెంట్తో పాటు కెప్టెన్ కోహ్లీకే చెందుతుంది. మణికట్టు స్పిన్నర్లు కోహ్లీ ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడు. కఠిన పరిస్థితుల్లో కూడా వీరిద్దరి అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్కి ఏ మాత్రం జంకకుండా ఊరిస్తూ ప్లైటెడ్ డెలివరీలు వేస్తూనే వికెట్లు తీస్తున్నారు' అని వివరించాడు.
కాగా, ఆరు వన్డేల సిరిస్లో చివరిదైన ఆఖరి వన్డే సెంచూరియన్లోని సూపర్స్పోర్ట్ స్టేడియంలో శుక్రవారం (ఫిబ్రవరి 16)న జరగనుంది. ఈ మ్యాచ్లో కోహ్లీసేన స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. సఫారీ గడ్డపై ఈ సుదీర్ఘ పర్యటనలో పలువురు సీనియర్ క్రికెటర్లు ఇప్పటికే అలిసిపోయారు. వన్డే సిరిస్ అనంతరం మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆఖరి వన్డేలో పలువురికి విశ్రాంతి కల్పించే యోచనలో జట్టు మేనేజ్మెంట్ ఉంది.