శాస్త్రి సేవలను వాడుకుంటాం:
బుధవారం చిన్నస్వామి స్టేడియంలో ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్తో దాదా భేటీ అయ్యారు. అకాడమీ అభివృద్ధి, మౌలిక వసతులపై ఇద్దరు చర్చించారు. తాజాగా గంగూలీ మాట్లాడుతూ... 'రవిశాస్త్రి పనితీరు బాగుంది. శాస్త్రి కోచ్గా ఉన్నంత వరకు ఎన్సీఏకు మరింత సహకారం అందించేలా ఒక వ్యవస్థను సృష్టిస్తున్నాం. శాస్త్రి సేవలను వాడుకుంటాం. ఎన్సీఏను మరింత ఉన్నత స్థానాలకు చేర్చాలనుకుంటున్నాం. రాహుల్ ద్రవిడ్, పరాస్ మహంబ్రే, భరత్ అరుణ్ సైతం మాతో ఉన్నారు' అని గంగూలీ అన్నారు.
అకాడమీపై రెండు గంటలు చర్చించాం
'ద్రవిడ్తో సమావేశం బాగా జరిగింది. అతడు భారత క్రికెట్లో ఒక దిగ్గజం. ఎన్సీఏ అధినేత. అకాడమీపై పూర్తిగా చర్చించాం. సమావేశం దాదాపు రెండు గంటలు సాగింది. సరికొత్త ఎన్సీఏను నిర్మిస్తున్నాం. అకాడమీని ముందుకు తీసుకెళ్లడం ఎలాగో తెలుసుకున్నాం. ఎన్సీఏలో బెంగళూరు నడిబొడ్డున ఉంది. మంచి స్థలం దొరికింది. బీసీసీఐ వారి వసతులను వాడుకుంటున్నందుకు కర్ణాటక క్రికెట్ సంఘం ఒక్క పైసా వసూలు చేయలేదు. ఎన్సీఏ ఎంత పెద్దగా ఉంటే మనకు అంత మంచిది' అని గంగూలీ పేర్కొన్నారు.
ఏటా రూ.10 కోట్లు
ఇటీవలే రెండోసారి టీమిండియా హెడ్ కోచ్గా నియమించబడిన రవిశాస్త్రి 2021 వరకు పనిచేస్తారు. జాతీయ జట్టు సేవల కోసమే ఆయనకు ఏటా రూ.10 కోట్లను పారితోషికంగా చెల్లిస్తున్నారు. మరోవైపు సౌరవ్ గంగూలీ కూడా గత నెల 23న బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. జాతీయ జట్టు, ఎన్సీఏ మధ్య సమన్వయం సృష్టించేందుకు శాస్త్రిని రెండు విధాలుగా ఉపయోగించుకోవాలని గంగూలీ చూస్తున్నారు.
విమానాశ్రయంలో గంగూలీ
సమావేశం అనంతరం గంగూలీ బెంగళూరు విమానాశ్రయంలో ఉండగా.. అతన్ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇది గమనించిన దాదా.. విమానాశ్రయంలోని చెకింగ్ పాయింట్ వద్ద అభిమానులు, భద్రతా సిబ్బందితో సెల్ఫీ తీసుకున్నారు. దీంతో విమానాశ్రయంలోని అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు.
అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు
అభిమానులతో సెల్ఫీ తీసుకొన్న ఫొటోని గంగూలీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'బెంగళూరు విమానాశ్రయంలో చెకింగ్ పాయింట్ వద్ద.అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. చాలా ఆనందంగా ఉంది' అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో వైరల్ అయింది.