100 పాయింట్లు కావాలి:
ప్రస్తుతం రవిశాస్త్రి భారత జట్టుతో కలిసి హామిల్టన్లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా శాస్త్రి మీడియాతో మాట్లాడుతూ... 'ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరడమే మా లక్ష్యం. లార్డ్స్లో జరిగే ఫైనల్లో ఆడాలంటే మాకు ఇంకా 100 పాయింట్లు కావాలి. విదేశీ గడ్డపై ఆడే ఆరు టెస్టుల్లో రెండు మ్యాచ్లను గెలిస్తే.. రేసులో ఉంటాం. న్యూజిలాండ్ టెస్టు సిరీస్నే మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచ నంబర్వన్ జట్టు అయిన మేము అదే స్థాయిలో ఉత్తమ ప్రదర్శన చేయాలని భావిస్తున్నాం. ఎందుకంటే.. ప్రపంచ నంబర్వన్ అనే భావన జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది' అని అన్నారు.
360 పాయింట్లతో అగ్రస్థానంలో భారత్:
ప్రస్తుతం టెస్ట్ చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ 360 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా (296), ఇంగ్లాండ్ (146), పాకిస్థాన్ (140) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా భారత్ ఇంకా విదేశాల్లో కివీస్తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు ఆడనుంది. కివీస్తో జరిగే ప్రతి మ్యాచ్కు 60 పాయింట్లు, ఇక ఆసీస్తో జరిగే ప్రతి టెస్టుకు 30 పాయింట్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో కివీస్తో జరిగే సిరీస్ గెలిస్తే దాదాపు ఫైనల్ బెర్త్ ఖాయం. ఇక పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు వచ్చే ఏడాది ఫైనల్ మ్యాచ్ ఆడుతాయి.
వారికి కూడా ఎంతో కష్టంగా ఉంటుంది:
ఇంకా రవిశాస్త్రి మాట్లాడుతూ... 'న్యూజిలాండ్ సిరీస్కు దాదాపు అయిదుగురు ప్రధాన ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. వారు లేకపోవడం పెద్ద లోటు. జట్టుకు, వారికి కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. న్యూజిలాండ్లో భువనేశ్వర్ కుమార్ అన్ని ఫార్మాట్లలో ఎంతో ఉపయోగపడతాడు. ఇక టెస్టుల్లో ఇషాంత్ శర్మ కీలక పాత్ర పోషిస్తూ జట్టుకు సానుకూలాంశంగా ఉంటాడు. కానీ.. గాయాలు ఆటగాళ్లను జట్టు నుంచి దూరం చేశాయి' అని పేర్కొన్నారు.
గిల్ జట్టుతోనే ఉంటాడు:
'శుభ్మన్ గిల్ అద్భుతమైన ఆటగాడు. గత రెండేళ్లగా అతడి ఆటతీరుని పరిశీలిస్తున్నా. గిల్కు ఎంతో ప్రతిభ ఉంది. తొలి టెస్టులో అతడు ఉన్నా లేకపోయినా జట్టుతోనే ఉంటాడు. పృథ్వీ షా పునరాగమనం చేయడం సంతోషం. జట్టుతో అతడు ఎక్కువ సమయం గడిపితే తప్పకుండా తిరిగి గాడిలో పడతాడు. దొరికిన అవకాశాల్ని షా సద్వినియోగం చేసుకోవాలి. సవాళ్లను అధిగమించి రాణిస్తాడని ఆశిస్తున్నా' అని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు.