హైదరాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ను అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ట్రోల్ చేశాడు. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన నుంచి భారత్ వచ్చిన పంత్.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో అభిమానుల కోసం ఒక ఫొటో పంచుకోన్నాడు. ఆ ఫొటోలో ఎర్ర రంగు టీషర్ట్, బ్ల్యూ జీన్స్ వేసుకున్నాడు. ముఖానికి మాస్క్, తలకు క్యాప్ పెట్టుకుని.. చేతులతో విజయసంకేతం పోజ్ ఇచ్చాడు. అయితే ఆ టీషర్ట్ మీద 'టామ్ అండ్ జెర్రీ' కార్టూన్ బొమ్మ ప్రింట్ ఉంది. 'మీలో ఎంతమంది ఈ కార్టూన్ను చూశారు?' అని పంత్ కాప్షన్ ఇచ్చాడు.
రిషభ్ పంత్ పోస్టును చూసిన రషీద్ ఖాన్ ట్రోల్ చేశాడు. 'నేను చాలాసార్లు నిన్నూ చూశాను, ఆ టామ్ను కూడా చూశాను' అని సరదాగా కామెంట్ చేశాడు. టీమిండియా అల్లరి పిల్లాడు యుజువేంద్ర చహల్ కూడా పంత్ను ఆటపట్టించాడు. 'నిన్ను చూడటమా లేక టామ్ అండ్ జెర్రీని చూడటమా?' అని ట్వీట్ చేశాడు. చహల్ ఇక్కడ రిషభ్ పంత్ను కార్టూన్ బాయ్గా సంభోదించాడు. వీరిద్దరి కామెంట్లకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ముఖ్యంగా చహల్ కామెంట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 15 వేల మంది లైక్ చేశారు.
గతవారం ఆస్ట్రేలియాతో ముగిసిన గబ్బా టెస్టులో రిషభ్ పంత్ (89; 138 బంతుల్లో 9x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్కు చిరస్మరణీయ విజయం అందించాడు. దీంతో భారత్ వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. పింక్ బాల్ టెస్టులో వృద్ధిమాన్ సాహా విఫలమవడంతో రెండో టెస్ట్ నుంచి పంత్ ఆడాడు. 5 ఇన్నింగ్స్లలో 274 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 97. రెండో టెస్టులో మోస్తరుగా రాణించినా ఆపై అదరగొట్టాడు. సిడ్నీ టెస్టులో భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాను తన దూకుడు బ్యాటింగ్తో విజయం వైపు నడిపించాడు. ఆ మ్యాచ్లో 97 పరుగులు చేసిన అతడు త్రుటిలో శతకం చేజార్చుకొని ఔటయ్యాడు. గబ్బా టెస్టులో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనుకున్న వేళ పుజారా (56), సుందర్ (22)తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. చివర్లో మరింత దూకుడుగా ఆడి భారత్కు అపురూప విజయం అందించాడు.
గబ్బా టెస్టులో మెరుపు బ్యాటింగ్ చేయడంతో ఒక్కసారిగా రిషభ్ పంత్ హీరో అయ్యాడు. ఈ సిరీస్కు ముందు పేలవ షాట్లతో వికెట్లు సమర్పించుకున్న అతడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే గతేడాది లాక్డౌన్ను సద్వినియోగం చేసుకున్నట్లు పంత్ తాజాగా చెప్పాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో హాయిగా గడపడంతో ఒత్తిడిని అధిగమించానన్నాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనలో బాగా ఆడినట్లు వివరించాడు. భారత్కు విజయాలు అందించడం కన్నా గొప్పేముంటుందని, ఆసీస్ గడ్డపై సిరీస్ విజయంలో తాను కీలక పాత్ర పోషించడం ఎంతో సంతోషానిచ్చిందని చెప్పాడు. ప్రస్తుతం పంత్ ఇంగ్లాండ్ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. త్వరలోనే ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఇరు జట్ల మధ్య మొత్తం నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరగనుంది.
విమాన ప్రమాదంలో నలుగురు ఆటగాళ్లు మృతి!!