
హైదరాబాద్: కెప్టెన్లు లేకపోతేనేం.. ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో సెలబ్రిటీలతో ధూందాంగా నిర్వహించాలని భావించింది బీసీసీఐ. అయితే రణవీర్ సింగ్ ప్రతినిధి బీసీసీఐకు పెద్ద షాక్ ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్సింగ్కు భుజానికి ఇటీవల గాయంకావడంతో ఆరంభోత్సవంలో అతని ప్రదర్శన ఉండదని ఆయన ప్రతినిధి సోమవారం వెల్లడించారు.
ఫుట్బాల్ మ్యాచ్లో అతడు గాయపడ్డాడని.. దీంతో భుజంపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చూసుకోవాలని వైద్యులు సూచించారని ప్రతినిధి పేర్కొన్నారు. ఏప్రిల్ 7న నిర్వహించనున్న గ్రాండ్ ఓపెనింగ్ ఈవెంట్లో రణ్వీర్ ప్రదర్శన చేయాల్సి ఉంది. కొన్ని వైద్య పరీక్షల అనంతరం రణ్వీర్కు డాక్టర్లు సలహాలిచ్చారు.
హై-ఎనర్జీ లెవల్స్తో ప్రదర్శన చేస్తే భుజంపై అధిక మొత్తంలో ఒత్తిడి పడుతుందని దీంతో గాయం తీవ్రత పెరిగే అవకాశముందని వైద్యులు సూచించినట్లు ప్రతినిధి చెప్పారు. రణ్వీర్ సింగ్ నటిస్తున్న గల్లీభాయ్ షూటింగ్లో అతడు రెగ్యులర్గా పాల్గొంటాడని వెల్లడించాడు.
ఎలాంటి స్టంట్స్ లేకుండా ఉన్న టాకీ సీన్లలో పాల్గొంటారని వివరించాడు. ఆరంభవేడుకల్లో రణ్వీర్తో పాటు బాలీవుడ్ హీరోయిన్లు పరిణితీ చోప్రా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని నిర్వాహకులు గతంలో వెల్లడించారు. ఇదిలా ఉంచితే టాలీవుడ్ నుంచి ఐపీఎల్కు తెలుగులో బ్రాండ్ అంబాసిడర్గా జూ.ఎన్టీఆర్ ఎంపికయ్యారు.