
హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్ట్ రజత్ శర్మ ఢిల్లీ & డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఎ) అధ్యక్ష పదవికి శనివారం రాజీనామా చేశారు. ఈ పదవిలో రజత్ శర్మ సుమారు 20 నెలల పాటు కొనసాగారు. అయితే, డీడీసీఏ ప్రధాన కార్యదర్శి వినోద్ తిహారాతో నెలకొన్న బహిరంగ విభేదాలతోనే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఈ మేరకు రజత్ శర్మ తన ట్విట్టర్లో "క్రికెట్ పరిపాలన అన్ని సమయాల్లోనూ ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. క్రికెట్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా స్వార్థ ప్రయోజనాలు ఎల్లప్పుడూ చురుకుగా పనిచేస్తాయని నేను భావిస్తున్నాను. నా సమగ్రత, నిజాయితీ మరియు పారదర్శకత సూత్రాలతో డీడీసీఏలో కొనసాగడం సాధ్యం కావడం లేదు. ఇందులో నేను రాజీ పడటానికి ఇష్టపడను" అని ట్వీట్ చేశాడు.
రజత్ శర్మపై ఉన్న గౌరవంతో డీడీసీఏ సీఈఓ రవి చోప్రా కూడా తన రాజీనామాను సమర్పించారు. మరోవైపు క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ)లో సభ్యులుగా ఉన్న సునీల్ వాల్సన్, యశ్పాల్ శర్మ కూడా రజత్ శర్మకు మద్దతుగా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అతుల్ వాసన్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కోచ్ కెపీ భాస్కర్ రంజీ ట్రోఫీ జట్టుకు కొనసాగుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
మాజీ ఆర్థిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీ నుంచి క్రియాశీల మద్దతు లభించిన తరువాత రజత్ శర్మ ఢిల్లీ & డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఎ) పరిపాలనలో భాగస్వామ్యమయ్యారు. అరుణ్ జైట్లీ చనిపోయిన తర్వాత రజత్ శర్మ డీడీసీఏలో పట్టు కోల్పోయాడని పాలకమండలి సభ్యులు భావిస్తున్నారు.
"నేను అధ్యక్ష హోదాలో ఉన్న సమయంలో నా విధులను న్యాయంగా మరియు పారదర్శకంగా నిర్వర్తించకుండా ఉండటానికి నేను చాలా రోడ్బ్లాక్లు, వ్యతిరేకత మరియు అణచివేతలను ఎదుర్కొన్నాను. దీంతో నేను ఏదో ఒకరోజు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. డీడీసీఏ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది" అని ఆయన చెప్పారు.