అందరి జీవితాలను మార్చేస్తుంది:
శుక్రవారం ఐపీఎల్ విడుదల చేసిన ఓ వీడియోలో రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ... 'కరోనా పరిస్థితులను దాటుకొని తిరిగి క్రికెట్ కొనసాగడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా రాజస్థాన్తో కలిసి ఆడనుండటం బాగుంది. ప్రపంచం మొత్తానికి పెను ముప్పుగా మారిన మహమ్మారిని ఎదుర్కొని మరీ ఆడటంతో ఈ ఏడాది ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ సాధారణ పరిస్థితులకు రావాలని ఆశిస్తున్నా. అది ఈ ఐపీఎల్తోనే జరుగుతుంది. టోర్నీ సజావుగా జరగాలని దేవుడిని కోరుకుంటున్నా' అని అన్నాడు.
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు:
'ఐపీఎల్ టోర్నీ కోసం భారత అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి ఇదో అతిపెద్ద ఈవెంట్. అందరి జట్లలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా గెలుపొందాలని భావిస్తున్నా. అందుకోసం నా వంతు కృషిచేస్తా. జట్టుగా శ్రమించాలి' అని కర్ణాటక బ్యాట్స్మన్ పేర్కొన్నాడు. 'భవిష్యత్లో ఎంతో ఆసక్తికరమైన ఆటగాడిగా యశస్వి జైశ్వాల్ మారనున్నాడు. అతడు దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్నాడు. మెగా టోర్నీలో మంచి ప్రదర్శన చేస్తే.. అతడు టీమిండియాకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది' అని ఉతప్ప చెప్పాడు.
స్మిత్ బాగా ఎదిగాడు:
రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్పై స్పందింస్తూ... '2011, 2013 సీజన్లలో ఇద్దరం పుణె వారియర్స్ తరఫున కలిసి ఆడాం. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అతడితో కలిసి ఆడబోతున్నా. ఇనేళ్లలో స్మిత్ బాగా ఎదిగాడు. అతని బ్యాటింగ్లో ఎంతో మార్పు వచ్చింది. అతడితో కలిసి ఆడేందుకు, పలు విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని రాబిన్ ఉతప్ప తెలిపాడు. గతేడాది వరకు కోల్కతా తరఫున ఆడిన ఉతప్ప.. ఈసారి రాజస్థాన్ తరఫున ఆడబోతున్నాడు.