హైదరాబాద్: భారత అండర్ 19 కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టు బాగోగుల విషయమై సరికొత్త నిర్ణయాలకు తెరదీశాడు. ఇటీవల అండర్ 19 జట్టు ఎంపిక విషయంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలను అనుసరించే నిర్ణయాలు తీసుకున్నట్లు సెలక్షన్ కమిటీ సభ్యుడొకరు వెల్లడించారు. ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లందరికీ అవకాశం దక్కాలనే ఉద్దేశంతో.. అండర్-19 ప్రపంచకప్కి ఒక్కసారి ప్రాతినిథ్యం వహించిన వారికి రెండోసారి ఛాన్స్ ఇవ్వకూడదని ద్రవిడ్ ఓ పాలసీని రూపొందించినట్లు తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన భారత అండర్-19 జట్టులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. రెండేళ్లకి ఒకసారి జరిగే అండర్-19 ప్రపంచకప్ కోసం ద్రవిడ్.. అన్ని రాష్ట్రాల యువ క్రికెటర్లని వివిధ పోటీల ద్వారా పరీక్షిస్తాడు. అంతిమంగా టోర్నీకి ఆరు నెలల ముందు ఓ తుది జట్టుని ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తాడు.
ఈ తరహా శిక్షణతోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన అండర్-19 ప్రపంచకప్లో భారత జట్టుని విజేతగా నిలిపాడు. ఒకసారి ప్రపంచకప్ ఆడిన వారికి రెండోసారి కూడా అవకాశం ఇస్తే.. వయసు సమస్య ఏర్పడుతోంది. దీంతో.. భారత- ఎ జట్టుకి కూడా కోచ్గా పనిచేస్తున్న ద్రవిడ్.. ఇక్కడ అవకాశం కోల్పోయిన వారికి భారత్-ఏ జట్టులో అవకాశమిస్తున్నట్లు కనిపిస్తుంది.
ఈ క్రమంలోనే అండర్ 19 వరల్డ్ కప్ జట్టులో వికెట్ కీపర్గా బాధ్యతలు వహించిన ఆర్యన్ జుయాల్ స్థానంలో అనూజ్ రావత్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇతనితో పాటుగా ఉత్తరప్రదేశ్ నుంచి జీషన్ అన్సారీ, ముంబై నుంచి ఆర్మాన్ జాఫర్, రాజస్థాన్ ఆల్-రౌండర్ మహిపాల్ లామ్రొర్, తమిళనాడు ఆల్-రౌండర్ వాషింగ్టన్ సుందర్, మధ్యప్రదేశ్ ఫేసర్ రాహుల్ బతాంలను రాబోయే ఎడిషన్కు సిద్ధం చేస్తున్నాడట.