న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్న బౌలర్లపై నిషేధం విధించడాన్ని టీమిండియా మాజీ కెప్టెన్, ఐపిఎల్ రాజస్థాన్ రాయల్స్ మెంటర్ రాహుల్ ద్రవిడ్ సమర్థించాడు. ఈ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ), అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) తీసుకుంటున్న చర్యలను ప్రశంసించాడు.
కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ ఆఫ్స్పిన్ బంతులపై బిసిసిఐ నిషేధం విధించిన నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ద్రవిడ్ సమాధానం చెప్పాడు. తాను వ్యక్తిగతంగా ఎవరి పేర్లను ప్రస్తావించనని, అయితే నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్న వారిని ఏరివేయడం సరైన చర్య అని అన్నాడు.
ఇలాంటి బౌలర్ల వల్ల నిబంధనలకు అనుగుణంగా బౌలింగ్ చేస్తున్న బౌలర్లకు అవకాశాలు రాకుండా పోయాయని, వీళ్ల బంతులు ఆడలేక చాలా మంది బ్యాట్స్మెన్ కెరీర్లే ప్రమాదంలో పడ్డాయని తెలిపాడు. యువ క్రికెటర్లు సరైన దిశలో పయనించడానికి ఈ నిషేధాలు ఉపయోగపడతాయని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.
బిసిసిఐ అడ్వజరీ కమిటీలో భాగమవుతారా? అని ప్రశ్నించగా.. ద్రావిడ్ స్పందించేందుకు నిరాకరించాడు. బుధవారం రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్పై.. ద్రవిడ్ స్పందించాడు. 'ఇంతకుముందు కూడా ఐపిఎల్లో చాలా మంది యువ క్రికెటర్లు తెరపైకి వచ్చారు. ఒకట్రెండు సీజన్ల తర్వాత మాయమయ్యారు. సర్ఫరాజ్కు ఎదగడానికి అవకాశాలు కల్పించాలి. రంజీ, ఇతర దేశవాళీ టోర్నీల్లో అతడెలా రాణిస్తాడో చూడాలి' అని ద్రావిడ్ తెలిపాడు.