హైదరాబాద్: అర్జున్ టెండూల్కర్ ఇటీవల భారత అండర్-19 జట్టు తరపున బరిలోకి దిగి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం శ్రీలంకతో యూత్ టెస్టులో ఆడుతున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన భారత మాజీ స్టార్ క్రికెటర్ల వారసుల్లో అర్జున్ ముందు వరుసలో ఉన్నాడు.
తాజాగా మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ పేరు తెరమీదికి వచ్చింది. 12 ఏళ్ల సమిత్ ద్రవిడ్ స్కూల్ స్థాయి క్రికెట్లో సత్తా చాటాడు. ఇటీవల బెంగళూరు వేదికగా జరిగిన అండర్-14 స్థాయి మ్యాచ్లో సమిత్ ద్రవిడ్ ఆల్రౌండ్ ప్రతిభ కనబర్చి జట్టుని విజయతీరాలకు చేర్చాడు.
మాల్యా ఆదితి ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు తరుపున బరిలోకి దిగిన సమిత్ ద్రవిడ్ అటు బ్యాట్తోనూ, ఇటు బంతితోనూ రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి కొట్టోనియాన్ షీల్డ్ తెచ్చిపెట్టాడు. ఈ మ్యాచ్లో 51 పరుగులతో నాటౌట్గా నిలిచిన సమిత్... బౌలింగ్లోనూ అదరగొట్టాడు.
కేవలం తొమ్మిది పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. సమిత్ తన ప్రదర్శనతో జట్టును గెలిపించడం ఇదే తొలిసారి కాదు. జవవరిలో జరిగిన బీటీడబ్ల్యూ కప్ అండర్-14 టోర్నీలోనూ అద్భుత సెంచరీతో జట్టును గెలిపించాడు. 2015లో జరిగిన గోపాలన్ క్రికెట్ ఛాలెంజ్లో అండర్ 12 స్థాయిలో బెస్ట్ బ్యాట్స్మన్ అవార్డుని దక్కించుకున్నాడు.
తండ్రి రాహుల్ ద్రవిడ్ బాటలో పయనిస్తే సమిత్ కూడా అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే దీని కోసం అతడు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.