అనూహ్యంగా టీ20 ప్రపంచకప్కి యాష్:
టీమిండియాలో యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ రాకతో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు పరిమిత ఓవర్లలో చోటు కాస్త కష్టమైంది. ఇక ఇటీవలి కాలంలో ఐపీఎల్ టోర్నీలో రాణిస్తున్న రాహుల్ చహర్, వరుణ్ చక్రవర్తిలకు టీంఇండియాలో చోటు దక్కడంతో యాష్ పూర్తిగా పరిమిత ఓవర్లకు దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతకొంతకాలంగా యాష్ టెస్టులకే పరిమితమయ్యాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్ట్ సిరీసులు గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఆపై ఇంగ్లండ్ సిరీసుకు ఎంపికయినా మ్యాచులు ఆడలేదు. అనంతరం ఐపీఎల్ 2021లో పర్వాలేదనిపించాడు. అయితే ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్ ఆడని యాష్.. అనూహ్యంగా టీ20 ప్రపంచకప్ 2021కి ఎంపికయి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది.
తుది జట్టులో ఎవరు ఆడుతారు:
యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2021కు ఎంపికయిన రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తిలు ఐపీఎల్ 2021లో రాణించారు. దాంతో స్పెసలిస్ట్ స్పిన్నర్ విషయంలో భారత్ తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి బౌలింగ్ చేసేది ఎవరా అని అందరూ ఆలోచిస్తున్నారు. అశ్విన్ ప్రాక్టీస్ మ్యాచులలో అదరగొట్టాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాపై 2 ఓవర్లు వేసి 8 పరుగులుఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు వరుణ్ 2 ఓవర్లు వేసి ఏకంగా 23 పరుగులు ఇచ్చాడు. దాంతో ఇపుడు యాష్ హైలెట్ అయ్యాడు. ఐపీఎల్ 2021లో అదరగొట్టిన వరుణ్ తుది జట్టులో ఆడుతాడా? లేదా ప్రాక్టీస్ మ్యాచులో అదరగొట్టిన యాష్ ఆడతాడో చూడాలి.
టీమిండియా ఘన విజయం:
వార్మప్ మ్యాచ్లో మరోసారి టీమిండియా ఘన విజయం సాధించింది. ఆసీస్పై మరో 12 బంతులు మిగిలుండగానే గెలిచింది. 153 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్కు కేఎల్ రాహుల్ (39), రోహిత్ శర్మ (60 రిటైర్ట్) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. రాహుల్ అవుటైన తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (38 నాటౌట్) కూడా రాణించాడు. చివర్లో రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్గా వెనుతిరగడంతో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా (14) సిక్సర్తో మ్యాచ్ ముగించాడు. దీంతో భారత జట్టు 17.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 రన్స్ చేసింది. ఇంగ్లండ్తో జరిగిన మొదటి మ్యాచ్లో కూడా టీమిండియా ఇదే రీతిలో అద్భుత విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే.