ధోనీపై ప్రశ్నలు:
ఐదుగురు సెలెక్టర్ల కమిటీలో ఎమ్మేస్కే ప్రసాద్, గగన్ ఖోడా పదవీకాలం ముగియడంతో.. బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించగా మొత్తం 40 మంది ఆసక్తి కనబరిచారు. షార్ట్ లిస్ట్ చేసిన అనంతరం జోషి, హర్విందర్, ప్రసాద్, చౌహాన్, శివరామకృష్ణన్ రేసులో నిలిచారు. బుధవారం సీఏసీ బృందం సెలెక్టర్ల పోస్టు కోసం వచ్చిన ఐదుగురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది. అయితే వారికి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ప్రశ్నలు అడిగారని సమాచారం.
ధోనీ భవిష్యత్పై మీ నిర్ణయం ఏంటి:
సెలెక్టర్ల పోస్టు కోసం ఇంటర్వ్యూకు వచ్చిన ఐదుగురు అభ్యర్థులకు ఎదురైన అతి క్లిష్టమైన ప్రశ్న 'ధోనీ భవిష్యత్పై మీ నిర్ణయం ఏంటి?'. 'ధోనీని టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేస్తారా? లేదా?' అని కూడా అడిగారట. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ ప్రశ్నలను బట్టి చూస్తే.. ధోనీ టీమిండియాకు ఆడే విషయంలో కొత్త ప్యానెల్ స్పష్టమైన విధానంతో ఉండాలని బోర్డు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొందరిని మాత్రం చైర్మన్ పోస్టు కావాలా? లేదా సభ్యుడిగానైనా ఓకేనా? అని కూడా సీఏసీ ప్రశ్నించినట్టు సమాచారం.
ఐపీఎల్ కోసం ప్రాక్టీస్:
వన్డే ప్రపంచకప్లో టీమిండియా సెమీస్ ఓటమి తర్వాత ఎంఎస్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టలేదు. ఈనెల 29న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-13 మొదలవనుంది. ఈ సీజన్ ఐపీఎల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్ మొదలెట్టాడు. సోమవారం చిదంబరం స్టేడియంలో ధోనీ క్రికెట్ సాధన మొదలుపెట్టాడు. నెట్స్లో బ్యాటింగ్ చేశాడు. హిట్టింగ్తో ఫ్యాన్స్ను ధోనీ అలరించాడు. చాలా కాలం తర్వాత మహీ సన్నాహకానికి దిగడంతో.. విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చారు.