
హైదరాబాద్: దుబాయి వేదికగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మూడో సీజన్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఒక్కో సీజన్లో ఒక్కో ఆటగాడు వెలుగులోకి వస్తుంటాడు. తాజా సీజన్లో 17 ఏళ్ల పాకిస్థాన్ యువ క్రికెటర్ షహీన్ అఫ్రిదీ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది.
పాకిస్థాన్ సూపర్ లీగ్లో షహీన్ బంతితో అద్భుతాలు చేస్తున్నాడు. శుక్రవారం జరిగిన ముల్తాన్ సుల్తాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 3.4 ఓవర్లు వేసిన షహీన్ 4 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. తద్వారా టీ20 క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన నాలుగో బౌలర్గా నిలిచాడు.
శుక్రవారం లాహోర్ క్వాలాండర్స్, ముల్తాన్ సుల్తాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ జట్టు 8 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఆ తర్వాత షహీన్ రంగంలోకి దిగడంతో సుల్తాన్ ముల్తాన్స్ జట్టు 114 పరుగులకే ఆలౌటైంది.
3.4 ఓవర్లు వేసిన షహీన్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లలో మూడు వికెట్లు తీశాడు. అనంతరం 115 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లాహోర్ క్వాలాండర్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
టీ20ల్లో మొత్తంగా చూస్తే శ్రీలంక బౌలర్ రంగనా హెరాత్ న్యూజిలాండ్పై, రషీద్ ఖాన్ ఐర్లాండ్పై, సోహైల్ తన్వీర్ ట్రిడెంట్స్ జట్టులపై 3 పరుగులిచ్చి ఐదేసి వికెట్లు తీశారు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో షహీన్ అఫ్రిది ప్రదర్శనపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.