
హైదరాబాద్: శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ గడ్డపై క్రికెట్ మ్యాచ్లు అంతంత మాత్రంగానే జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) పుణ్యమా? అని ఇప్పుడిప్పుడే ఆ దేశంలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి.
చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
పీఎస్ఎల్ మూడో సీజన్ లీగ్ మ్యాచ్లను యూఏఈ వేదికగా నిర్వహించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్లను పాక్ గడ్డపై నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. పాక్ గడ్డపై మ్యాచ్ అనగానే పలువురు విదేశీ క్రికెటర్లు ప్లే ఆఫ్ మ్యాచ్లు ఆడేందుకు నిరాకరించగా, మరికొందరు అంగీకరించారు.
బుధవారం పెషావర్ జల్మీ-కరాచీ కింగ్స్ జట్ల మధ్య ఎలిమినేటర్-2 మ్యాచ్ జరిగింది. మ్యాచ్కు ముందు వర్షం పడటంతో ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దాంతో సాధ్యమైనన్ని ఓవర్ల పాటు మ్యాచ్ను జరిపించాలని భావించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అందుకు తగిన ఏర్పాట్లను చేసింది.
ఇందు కోసం రెండు హెలికాప్టర్లను తెప్పించిన పాక్ బోర్డు వాటి సాయంతో ఔట్ ఫీల్డ్ను ఆరబెట్టింది. ఇది నాకౌట్ మ్యాచ్ కావడంతో హెలికాప్టర్లతో పిచ్ను సిద్ధం చేయడం ఒక్కటే మార్గమని తలచిన పీసీబీ.. ఆ మేరకు చర్యలు తీసుకుని విజయవంతం అయింది. దీంతో మ్యాచ్ సజావుగా జరిగేలా చేసింది.
దీంతో 16 ఓవర్ల పాటు మ్యాచ్ జరపడానికి అంపైర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మ్యాచ్లో పెషావర్ జల్మీ 13 పరుగుల తేడాతో విజయం సాధించి పీఎస్ఎల్ మూడో సీజన్ ఫైనల్కు చేరింది. పెషవార్ జల్మీ ఆటగాడు డాసన్ 35 బంతుల్లో 4 సిక్సులు, 4 ఫోర్ల సాయంతో 62 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అదే, ఈ గనుక మ్యాచ్ జరగపోయి ఉండి ఉంటే ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులోనూ నాకౌట్ మ్యాచ్లంటే మరీ ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ప్రధానంగా వర్షం వెలిసిన తర్వాత అవుట్ ఫీల్డ్ను సిద్ధం చేయడంలో క్రికెట్ బోర్డులో సరైన చర్యలు తీసుకోలేకపోతే విమర్శలు వర్షం కురిసేదే.